సారీ బ్రదర్!...అని అన్నకు మెసేజ్ పంపి సూసైడ్ చేసుకున్న యువకుడు
శ్రీకాకుళం:అసలే నిరుద్యోగి!...దానికి తోడు ప్రమాదంతో కాలికి గాయమై అంగవైకల్యమూ సంప్రాప్తించింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై జీవితంపై విరక్తి పెంచుకున్నాడు.
ఆ క్రమంలోనే అన్నకు సింపుల్ గా సారీ బ్రదర్ అని మెసేజ్ పెట్టి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ యువకుడి తండ్రి ఉపాధి నిమిత్తం దుబాయ్ కు వెళ్లగా కుమారుడికి ఉద్యోగం లేకపోయినా...ఉన్నంతలో బాగానే చూసుకుంటున్నామని అతడి తల్లి చెబుతోంది. అయినా కొడుకు ఇలా అర్థాంతరంగా బ్రతుకు చాలించాడంటూ అతడి తల్లిదండ్రులు,సోదరుడు కన్నీరుమున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే...
శ్రీకాకుళం జిల్లాకు చెందిన అంపురం గ్రామానికి చెందిన గెడ్డం సుధీర్ బీటెక్ పూర్తి చేశారు. రెండేళ్ల క్రితం ఉద్యోగ ప్రయత్నాల కోసం హైదరాబాద్కు వెళ్లాడు. అక్కడే పోటీపరీక్షలకు శిక్షణ పొందుతున్నాడు...ఉద్యోగం కోసం రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈ క్రమంలో కొంతకాలం కిందట ఓ ప్రమాదంలో కాలికి తీవ్ర గాయమై దివ్యాంగుడిగా మారాడు.

ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోవడం...ఊహించని విధంగా దివ్యాంగుడుగా మారడంతో జీవితంపై విరక్తి చెంది హైదరాబాద్లో శుక్రవారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. చనిపోయేముందు 'సారీ బ్రదర్...' అంటూ సోదరుడికి సందేశం పంపాడని...ఆ తరువాత సూసైడ్ చేసుకున్నాడని తెలిసింది.
సుధీర్ సోదరుడు సంతోష్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడని అతడి సాయంతోనే సుధీర్ హైదరాబాద్ లో పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడని తెలిసింది.
సుధీర్ తండ్రి తులసీదాస్ వలసకూలీ కాగా ఆయన ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు. తల్లి భూదేవి గ్రామంలోనే ఉంటోంది. కుమారుడు హైదరాబాద్ లో మృతిచెందాడనే వార్త తెలిసి ఆ తల్లి కుమిలిపోతోంది. చేతికి ఎదిగివచ్చిన కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించాడని ఆమె గుండెలవిసేలా రోదిస్తుంటే ఓదార్చడం ఎవరితరం కావటం లేదు.
సుధీర్ మృతదేహానికి హైదరాబాద్లో పోస్టుమార్టం పూర్తిచేసి, ప్రత్యేక వాహనంలో స్వగ్రామానికి తరలిస్తున్నారు. మరోవైపు తండ్రి తులసీదాస్ కూడా దుబాయ్ నుంచి బయలుదేరి స్వగ్రామం చేరుకోనుండటంతో ఆదివారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు.












Click it and Unblock the Notifications