JC బద్రర్స్ కు ఊహించని షాక్!!
ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ బ్రదర్స్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నరసాపురానికి చెందిన జేసీ బ్రదర్స్ ప్రధాన అనుచరుడు రామాంజులరెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు. రామాంజులరెడ్డితో పాటూ అతని వర్గీయులు అంతా కలిపి 160 కుటుంబాలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. యాడికి మండలం రాయలచెరువుకు చెందిన రమణారెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రధాన అనుచరుడు, తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్ ఉన్న చోట వైసీపీలో చేరికలు జిల్లావ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.
తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నప్పటికీ గుర్తింపు లభించడంలేదని, జేసీ సోదరులు వర్గ కక్షలు పెంచి పోషిస్తున్నారని, దీంతో వారి వైఖరి నచ్చక అందరూ వైసీపీలో చేరారని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి చెప్పారు. తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరినవారందరికీ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వారికి తాను అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. కుల, మత రాజకీయాలకు అతీతంగా వైసీపీ రాజకీయం చేస్తుందని, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు.
జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి సోదరులకు రామాంజులరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా వైసీపీలో చేరడమనేది సోదరులిద్దరికీ షాక్ లాంటిదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తాడిపత్రి నుంచి ఎమ్మెల్యేగా ప్రభాకర్ రెడ్డి, అనంతపురం నుంచి ఎంపీగా దివాకర్ రెడ్డి పోటీచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. గత ఎన్నికల్లో వీరి వారసులిద్దరూ ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికలకు వారసులు వద్దని, మీరే పోటీచేయాలని అధినేత గట్టిగా చెప్పారు.