బాబోయ్...అది బాంబు అంట...పరుగులు తీసిన గ్రామస్థులు....
తూర్పు గోదావరి: జిల్లాలోని ఒక గ్రామంలో ఆదివారం ఉన్నట్టుండి పెద్ద అలజడి రేగింది. కారణం...స్థానికుడు తన ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా బైటపడిన ఒక వస్తువు. మట్టితో కప్పబడిపోయి ఉన్న ఆ లోహపు వస్తువును చూసి ఏదో పాతకాలపు ఇనుప వస్తువు అనుకున్నారు.
అయితే గ్రామంలో ఇలా వింత వస్తువు బైటపడిన సంగతి తెలిసి స్థానికులు గుంపులు గుంపులుగా పెద్ద సంఖ్యలో అక్కడకు చేరారు. అయితే వారిలోని ఒక వయో వృద్దుడు ఆ వస్తువును పరీక్షగా చూపి అది కేవలవ ఇనుప వస్తువు కాదని ఒక బాంబు అని తేల్చాడు. అంతేకాదు అది రెండో ప్రపంచ యుద్దంలో వాడేందుకు గాను అప్పటి సైనికులు తెచ్చిన బాంబుగా నిర్థారించాడు. దీంతో ఆ బాంబును అప్పటిదాకా తడిమి చూసిన వాళ్లు అది బాంబని తెలిసాక భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు.

ఇలా బైటపడింది
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం వాలుతిమ్మాపురం గ్రామానికి చెందిన చిలకపాటి సుదర్శనం అనే వ్యక్తి తన గృహనిర్మాణం కోసం పునాదులు తీపిస్తుండగా పూర్తిగా మట్టితో కప్పబడిన ఒక లోహపు వస్తువు బైటపడింది. తొలుత అది ఏ లంకెబిందెల్లాంటి కలశం అయివుంటుందని ఆశపడ్డారు. తరువాత పరీక్షగా చూసి ఇనుపతుప్పు కనిపిస్తుండటంతో అది ఐరన్ తో చేసిన వస్తువుగా తేల్చారు. అయితే ఆ వస్తువు ఆకారం వింతగా ఉండటంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి చూస్తున్నారు.

అది బాంబంట...
అలా వచ్చిన వయోవృద్దుడైన ఒక స్థానికుడు ఆ వస్తువును తేరిపారా చూసి దాన్ని ఎవరూ ముట్టుకోవద్దని హెచ్చరించాడు. అది ఒక బాంబు అని స్పష్టం చేశాడు. అంతేకాదు దీన్నిరెండవ ప్రపంచ యుద్దంలో వాడేందుకు అప్పటి సైనికులు ఇక్కడకు తెచ్చిఉండొచ్చని గుర్తుచేసుకున్నాడు.
ఆ యుధ్దం జరుగుతున్న రోజుల్లో బ్రిటీష్ సైనికుల్లో కొన్ని పటాలాలు ఈప్రాంతంలో గుడారాలను వేసుకుని ఉండేవారని తెలిపారు.

స్థానికుల పరుగులు...
అప్పటివరకు ఆ వింతవస్తువు చుట్టూ తిరిగి శల్యపరీక్ష చేసిన గ్రామస్థులు తీరా అది బాంబని తేలేసరికి ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అప్పటివరకు ఆ వస్తువును తడిమి తడిమి చూసిన వారంతా అది బాంబని తెలియగానే ఆమడదూరం పరిగెత్తారు. బాబోయ్ బాంబంట...పేలితే ఊరు వల్లకాడవుతుందంటూ అక్కడ నుంచి పరుగులు పెట్టారు.

బాంబు ఆనాటిది...
సుమారు 10 కేజీల బరువుతో ఉన్న ఈ బాంబు శకలం రెండో ప్రపంచ యుద్ధ సమయంలోదేనని గ్రాముస్థులు అంటున్నారు. 78 ఏళ్ల క్రితం జరిగిన ఆ యుద్దం సమయంలో కొన్ని బాంబు శకలాలు ఇక్కడే వదిలేసి ఉంటారని, వారు వాడకుండా వదిలేసినవి, పేలనివి ఇక్కడ భూస్థాపితం చేసి ఉండవచ్చునని గ్రామస్థులు అంటున్నారు. సుమారు 50 ఏళ్ల కిందట కూడా ఇదే గ్రామంలో ఇలాంటిదే ఒక బాంబుశకలం లభ్యంకాగా, అదేంటో తెలియక పగులగొట్టే ప్రయత్నం చేశారని గ్రామస్థులు చెప్పారు. దీంతో ఆ బాంబు పెద్ద శబ్ధంతో పేలిపోయిందని , ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారని వారు గుర్తుచేశారు.

పోలీసులు స్వాధీనం...
చివరకు ఈ సమాచారం పోలీసులకు తెలిసి ఎస్ఐ ఎ.కృష్ణభగవాన్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఆ బాంబు శకలాన్ని పరిశీలించి దానిని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని ప్రభుత్వానికి అందజేస్తామని, బాంబ్ స్క్వాడ్ వారు బాంబు శకలం వివరాలు నిర్ధారిస్తారని పోలీసులు తెలిపారు. దీంతో ఆ బాంబు శకలం కథ అలా ముగిసింది.












Click it and Unblock the Notifications