అసెంబ్లీ సీట్ల పెంపు: టిడిపి, టిఆర్ఎస్కు లాభమే, బిజెపి ప్లాన్ ఇదే!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బీజేపీ సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయమై మరోసారి కదలిక వచ్చినట్టు సమాచారం.
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై బీజేపీ సానుకూలంగా ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన సందర్భంగా ఈ విషయమై మరోసారి కదలిక వచ్చినట్టు సమాచారం. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యులతో బాబు చర్చించారని సమాచారం. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు బిజెపి మొగ్గు చూపడం ఆ పార్టీ వైఖరిలో మార్పుకు సంకేతమనే అభిప్రాయాన్ని రాజకీయవిశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన విషయమై కొంత కాలంగా చర్చ సాగుతోంది. అయితే తొలుత ఈ విషయమై సానుకూలంగా బిజెపి ఉన్నట్టు కన్పించింది. అయితే ఆరు మాసాల క్రితం నియోజకవర్గాల పెంపు కారణంగా రాజకీయంగా తమకు ఏ మాత్రం ప్రయోజనం ఉండదని బిజెపి భావించింది.
ఈ కారణంగా నియోజకవర్గాల పెంపు పట్ల బిజెపి కొంత అయిష్టతతో ఉందనే ప్రచారం సాగింది.
నియోజకవర్గాల పెంపు వల్ల రెండు రాష్ట్రాల్లో అధికారాల్లో ఉన్న రెండు పార్టీలకు రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వచ్చిన నేతలతో పాటు పార్టీలో ఉన్న నేతలకు కూడ అసెంబ్లీ సీట్లను సర్ధుబాటు చేసే అవకాశం దక్కనుంది.

అసెంబ్లీ సీట్ల పెంపుపై బిజెపి సానుకూలత
అసెంబ్లీ సీట్ల పెంపుపై బిజెపి సానుకూలంగా ఉందనే సంకేతాలు వస్తున్నాయి. మరోసారి అసెంబ్లీ సీట్ల పెంపు విషయమై కదలిక వచ్చిందని ఢిల్లీలో ప్రచారం సాగుతోంది. ఈ మేరకు టిడిపి వర్గాలకు కూడ సమాచారం ఉందంటున్నారు. వారం రోజుల క్రితం ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన చంద్రబాబునాయుడుకు ఈ విషయమై కేంద్రం నుండి సానుకూలమైన సంకేతాలు వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల్లో సమాచారం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారంలో ఉంది.

మిత్రపక్షాలను పెంచుకొనేందుకేనా?
2019లో సాధారణ ఎన్నికలు, ఆ తర్వాత రాజకీయ సమీకరణలను అంచనా వేసిన తర్వాత బీజేపీ ఈ విషయంలో సానుకూల వైఖరికి వచ్చిందంటున్నారు.. 2019 ఎన్నికల్లో మిత్రపక్షాలను పెంచుకునే విషయంలో బీజేపీ ఇప్పటికే తన వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించిందని తెలుస్తోంది.ఈ మేరకు రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు.

బడ్జెట్ సమావేశాల్లో నియోజకవర్గాల పెంపు బిల్లు?
మరో రెండు, మూడు వారాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపుపై కేంద్రం నిర్ణయం తీసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.అయితే నియోజకవర్గాల పెంపు విషయమై బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెడతారని ప్రచారం కూడ సాగుతోంది.

రెండు రాష్ట్రాల వాదన ఇలా...
170వ అధికరణను సవరించకపోతే 2026 వరకు ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యే కొనసాగుతుందని కేంద్రం భావించింది. కానీ, సెక్షన్ 26 (1) ఉద్దేశం అది కాదని, 170వ అధికరణను ప్రస్తావించినంత మాత్రాన నియోజకవర్గాలను 2026 వరకు స్తంభింపచేయాలని కాదని రెండు తెలుగు రాష్ట్రాలు వాదించాయి. దీని మేరకు
మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగా సీట్లను పెంచాలని అర్థం చేసుకోవాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కోరాయి. 170వ అధికరణకు అనుగుణంగా నియోజకవర్గాల పెంపు జరుగుతుందని సెక్షన్ 26లో సవరణ చేస్తూ చట్టాన్ని సాధారణ మెజారిటీతో ఆమోదించవచ్చునని పేర్కొన్నాయి.












Click it and Unblock the Notifications