ఏపీ- తెలంగాణ పై కేంద్రం ఫోకస్ : 12న ఢిల్లీకి పిలుపు - అసలు అజెండా ఇదే..!!
ఏపీ..తెలంగాణ రాష్ట్రాలపైన సుదీర్ఘ విరామం తరువాత కేంద్రం ఫోకస్ పెట్టింది. జనవరి 12న ఢిల్లీకి రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ ఆహ్వానం పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 అమలులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారమే అజెండాగా ఈ సమావేశం జరగనున్నట్లు కేంద్రం పంపిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను కోరింది.

ఇరు రాష్ట్రాల సీఎస్ లకు లేఖ
విభజన సమస్యలే అజెండాగా ఈ సమావేశం జరుగుతుందని కేంద్రం తన లేఖలో స్పష్టం చేసింది. గత నెలలో కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన తిరుపతిలో జరిగిన దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో రెండు రాష్ట్రాలు పెండింగ్ అంశాల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరాయి. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్ని నదీ జలాల పంచాయితీ పైన ఇందులో చర్చించే అవకాశం ఉంది. తాజాగా కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేసినప్పటికీ, ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను బోర్డుకు పూర్తి స్థాయిలో అప్పగించలేదు. విభజన పూర్తయి ఎనిమిదేళ్లు అవుతున్నా.. ఇప్పటికే రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు అనేకం పెండింగ్ లో ఉన్నాయి.

విభజన అంశాలే అజెండాగా..
కృష్ణా జలాల విషయంలో వాటాలు తేల్చాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతోంది. కృష్ణా వాటా తేలే వరకు ఉమ్మడి వాటా నుంచి 50:50 నిష్పత్తిలో పంచుకోవాలని సూచిస్తోంది. దీంతో పాటు రాయలసీమ ఎత్తిపోతల పథకంపైనా తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉంటే, తెలంగాణలో నిర్మిస్తున్న పలు ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతోంది. ఈ క్రమంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల వద్ద జలవిద్యుత్తు ప్లాంట్ల నిర్వహణ విషయంలోనూ రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం సాగింది. పరస్పరం ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. దీంతో..ఈ సమావేశంలో ఈ ప్రాజెక్టులు- నీటి వినియోగం అంశం పైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ - తెలంగాణ వాదనలు వినేందుకు
వీటితో పాటుగా తెలంగాణ నుంచి తమకు రావాల్సిన విద్యుత్ బకాయిల పైన ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. ఇక, ఆర్టీసీ ఆస్తుల వ్యవహారం ఇంకా పూర్తిగా కొలిక్కి రాలేదు. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన జరగేలేదు. రెండు రాష్ట్రాలు గదులను పంచుకుని తాత్కాలికంగా సర్దుబాటు చేసుకున్నాయి. అయితే ఉమ్మడి భవన్లో పటౌడీ హౌజ్, నర్సింగ్ హాస్టల్ ప్రాంతాలు ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. రెండు రాష్ట్రాల మధ్య భవన్ విభజన జరిగితే, ఖాళీ స్థలం పొందిన రాష్ట్రం కొత్త భవన సముదాయాన్ని నిర్మించుకోవాల్సి ఉంటుంది.

నీటి జగడాలపైనే ప్రధానంగా ఫోకస్
రాష్ట్రం వెలుపల ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాలని విభజన చట్టంలో పేర్కొన్న నేపథ్యంలో పంపకాలు జరగాల్సి ఉది. అదే విధంగా కొన్ని స్థాయిల్లోని ఉద్యోగుల విభజన అంశం సైతం పెండింగ్ లో ఉంది. ఈ సమావేశం ద్వారా ప్రధానంగా నీటి వివాదాల సమస్యకు పరిష్కారం చూపించాలని కేంద్రం భావిస్తోంది. రెండు రాష్ట్రాలు తమకు భవిష్యత్ రాజకీయాల్లో కీలకం కానుండటంతో కేంద్రం తమ బాధ్యతలను పూర్తి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే, ఈ సమావేశంలో రెండు రాష్ట్రాలు తమ వాదనలు బలంగా వినిపించేందుకు సిద్దం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications