రాజధానికి రూ.2050 కోట్లిచ్చాం, ప్రత్యేక హోదా అవసరంలేదు: కేంద్రమంత్రి షాక్
న్యూఢిల్లీ: ఏపీకి ఏమీ ఇవ్వలేదన్న కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్ర రావు, జేడీ శీలం వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హెచ్పీ చౌదరి ఆ తర్వాత మాట్లాడారు. విభజన హామీలను ఒక్కటొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు రెండేళ్లలో రూ.750 కోట్లు ఇచ్చామని చెప్పారు.
రాజధాని నిర్మాణానికి రెండేళ్లలో రూ.2050 కోట్లు ఇచ్చామన్నారు. విశాఖ, తిరుపతి, విజయవాడలలో విమానాశ్రయాల విస్తరణకు భూసేకరణ జరుగుతోందని చెప్పారు. ఏపీకి ఆర్థిక సాయంపై నీతి అయోగ్ పరిశీలిస్తుందని చెప్పారు.
విభజన బిల్లులోని ప్రతి అంశాన్ని నీతి అయోగ్ పరిశీలిస్తుందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు అన్ని సంస్థలకు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం రాష్ట్రానికి హోదా ఇవ్వాలని సూచించలేదన్నారు.
ఏపీకి పన్ను రాయితీలు, ప్రత్యేక సాయం చేస్తున్నామని చెప్పారు. రెవెన్యూ లోటును కూడా భర్తీ చేయాలని ఆర్థిక సంఘం సూచించిందని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదనుకుంటున్నానని ఆయన చెప్పారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.