ఏపీకి సాయం కావాలి, కేంద్రానికి ముఖ్య రాష్ట్రం: కేంద్రమంత్రి అర్జున్
విజయవాడ: విభజన అనంతరం ఏపీకి ప్రత్యేక సాయం అవసరమని కేంద్రం గుర్తించిందని, దీని పైన ఇప్పటికే కేంద్రం చర్చలు జరుపుతోందని, త్వరలోనే మంచి నిర్ణయం వస్తుందని కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ మంగళవారం నాడు అన్నారు.
ఆయన విజయవాడలోని దుర్గా ఘాట్ను సందర్శించారు. పుణ్య జలాలను తల పైన సంప్రోక్షణ చేసుకున్నారు. ఆయన వెంట మంత్రి కామినేని శ్రీనివాస రావు ఉన్నారు. ఈ సందర్భంగా మేఘవాల్ స్పందించారు.
పుష్కరాలకు ఏర్పాట్లు బాగున్నాయని, ఏపీ ప్రభుత్వం కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. స్వాతంత్య్ర పోరాట యోధులకు నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చినట్లు మేఘ్వాల్ తెలిపారు.
ప్రత్యేక హోదా పైన పార్లమెంటులో చర్చ జరిగిందని, త్వరలో నిర్ణయం వెలువడుతుందన్నారు. త్వరలో ఏపీకి తీపి కబురు ఉంటుందన్నారు. కేంద్రానికి ఏపీ అతి ముఖ్యమైన రాష్ట్రమన్నారు. హోదానా, లేక ప్యాకేజీయా త్వరలో ప్రకటిస్తామని చెప్పారు.
పుష్కరాలు: గాలిదుమారంతో ఇబ్బందులు
కృష్ణా పుష్కరాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శని, ఆది, సోమవారాలు సెలవు కావడంతో ఎక్కువ మంది పుణ్య స్నానాలు ఆచరించారు. మంగళవారం నాడు విజయవాడలోని ఫెర్రీ ఘాట్లో కొంత రద్దీ తగ్గింది. మరోవైపు, పుష్కరాల సందర్భంగా గాలి దుమారంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.