శుభవార్త.. రాజధాని అమరావతి అభివృద్ధికి వరమిచ్చిన మోదీ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టించి గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం చూపించాలని చంద్రబాబు సర్కార్ ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఏపీలో కేంద్ర సహాయంతో చేయగలిగిన అభివృద్ధిని చేసేందుకు కేంద్ర మంత్రులు విశేషంగా కృషి చేస్తున్నారు.
ఏపీకి కేంద్రం మరో నజరానా
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తదితరులు చేస్తున్న కృషి కారణంగా ఏపీకి అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అద్భుతమైన ప్రాజెక్టును కేంద్రం ఏపీకి అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.

రాజధాని అమరావతి అభివృద్ధికి కీలక అడుగు
కేంద్ర గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. ముఖ్యంగా రాజధాని అమరావతి ప్రాంత ప్రజలకు రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించి అభివృద్ధి పైన కీలక ప్రకటన చేశారు. రాజధాని అమరావతిని కలుపుకుంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్ వెల్లడించారు.
అమరావతి మీదుగా ఎన్ హెచ్ 16 అభివృద్ధి ప్రణాళిక
ఇటీవల గుంటూరు కలెక్టరేట్లో జాతీయ రహదారుల పనుల పైన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కృష్ణా జిల్లాను, గుంటూరు జిల్లాను కలిపే ఎన్ హెచ్ 16 అభివృద్ధి ప్రణాళిక చూసి చాలా బాగుందని కితాబిచ్చారు. ఈ హైవే విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్ తదితర పనులు వెంటనే చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్ లా ఈ హైవే
వినుకొండ, గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించి మరో 25 కిలోమీటర్లు పొడిగించనున్నట్టు తెలిపారు. రాజధాని అమరావతిని తాకేలా మంచి ప్రణాళిక రూపొందిందని ఈ హైవే నిర్మాణం జరిగితే రాజధాని అమరావతి ప్రాంతం చాలా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది గుంటూరుకు మరో ఔటర్ రింగ్ రోడ్ లా మారుతుందని పేర్కొన్నారు.
రెండేళ్లలో హైవే నిర్మాణం
దీనిని పూర్తిగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుందని తెలిపారు. రెండేళ్లలోనే ఈ హైవే నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ హైవే నిర్మాణం జరిగితే ఏపీలో రవాణా సేవలు మరింత మెరుగు పడతాయని ఆయన వెల్లడించారు.












Click it and Unblock the Notifications