బాబుకు స్మృతి సూచన, హోదాపై చర్చిస్తున్నాం, 50 ఏళ్లు ఏం చేశారు: వెంకయ్య
తాడేపల్లిగూడెం: కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు ఓ విజ్ఞప్తి చేశారు. ఏపీని విద్యా హబ్గా తీర్చిదిద్దాలని, అలాగే, విద్యాసంస్థల్లో విద్యార్థులకు, విద్యార్థినీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
గురువారం నాడు తాడేపల్లిగూడెంలో నిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడారు. ఐఐఎం విశాఖకు రూ.680 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. ఏపీని విద్యా కేంద్రంగా చేయాలని చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారన్నారు.
తిరుపతి ఐఐటికి రూ.700 కోట్లు, తాడేపల్లిగూడెం ఎన్ఐటికి రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మరుగుదొడ్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులకు, విద్యార్థినీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఏపీలో నాలుగు విద్యాసంస్థలకు శంకుస్థాపన చేశానని చెప్పారు. జాతీయ సంస్థలకు శంకుస్థాపన చేయడం తన అదృష్టమన్నారు. ఏపీ పారిశ్రామికవేత్తలకు నెలవు అని, ఇక్కడి నుంచి ఎంతోమంది వచ్చారన్నారు.
మోడీని ఆకాశానికెత్తిన వెంకయ్య
ప్రధాని నరేంద్ర మోడీ విదేశాలకు వెళ్తే టూరిస్ట్ ప్రధాని అని విపక్షాలు విమర్శిస్తున్నాయని, మరి బావిలో కప్పలా ఉండాలా అని ఎద్దేవా చేశారు. విదేశాలకు వెళ్లి భారత్ ప్రతిష్టను మోడీ పెంచుతున్నారన్నారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి చేయాలన్నదే మోడీ లక్ష్యమన్నారు.
భారత దేశం వృద్ధి రేటును 7.3 శాతం సాధించిన ఘనత మోడీది అన్నారు. మోడీని ప్రపంచం రాక్ స్టార్ అంటోందన్నారు. తమకు అధికారం ఇచ్చే నాటికి దేశం చాలా వెనుకబడిందని, అందుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు. ముందు దానిని సరిదిద్దాలన్నారు. ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు.
పెద్దవాడిగా చెబుతున్నానని.. క్రమశిక్షణ, జాతీయభావం మనకు ఉండాలన్నారు. పేపర్ బాయ్గా పని చేసిన కలాం రాష్ట్రపతిగా, చాయ్ అమ్ముకున్న మోడీ ప్రధాని, నేను కూడా కేంద్రమంత్రిని అయ్యానని, అంకితభావం ఉంటే ఎవరైనా ఏదైనా సాధిస్తారన్నారు.
ప్రపంచమంతా మోడీ మోడీ అంటోందన్నారు. ప్రపంచం పోటీగా వెళ్తోందని, ప్రధాని మోడీ కూడా దూసుకెళ్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై వెంకయ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా పైన చర్చలు జరుగుతున్నాయన్నారు. తాము ప్రత్యేక హోదాపై చర్చిస్తున్నామన్నారు. ఏడాదిలోనే వారు ఏం చేశారని అడుగుతున్నారని, త్వరలో అన్నీ బయటపెడతామని, అసలు యాభై ఏళ్లు పాలించి కాంగ్రెస్ ఏం చేసిందన్నారు.