జైట్లీతో 'టి': హడావుడిగా బాబు, బిజెపికి కృష్ణంరాజు షాక్
న్యూఢిల్లీ/కోల్కతా: తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలపడంతో బిల్లుపై కేంద్రమంత్రులు కమల్ నాథ్, సుశీల్ కుమార్ షిండే, జైరామ్ రమేష్లు భేటీ అయి చర్చిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత అరుణ్ జైట్లీతో కేంద్రమంత్రి భేటీ అయ్యారు. లోపాలు, సవరణల పైన చర్చించారు.
ఆగమేఘాలపై ఢిల్లీకి చంద్రబాబు!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కోల్కతాలో సోమవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. ఎపిలో కాంగ్రెసు పార్టీ విభజన చిచ్చు పెట్టిందని ఆయన మమతకు వివరించారు. అనంతరం ఆయన హైదరాబాదు బయలుదేరాల్సి ఉండగా ఢిల్లీ పయనమవుతున్నారు. రేపు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు.

ఎపి భవన్లో ఉద్రిక్తత
ఢిల్లీలోని ఎపి భవన్ మరోసారి ఉద్రిక్తంగా మారింది. టిడిపి ఎంపి రమేష్ రాథోడ్ను పలువురు తెలంగాణవాదులు అడ్డుకున్నారు. టిడిపికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు చలసాని శ్రీనివాస రావును తెలంగాణవాదులు అడ్డుకున్నారు. ఇరు ప్రాంతాల నేతలు తెలంగాణ, సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
బిజెపికి రఘురామ కృష్ణం రాజు ఝలక్
ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి భారతీయ జనతా పార్టీలో చేరిన రఘురామ కృష్ణం రాజు విభజన అంశంపై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విభజనకు వ్యతిరేకంగా అంతకుముందు వేసిన పిటిషన్ను శుక్రవారం తిరస్కరించిన విషయం తెలిసిందే. సోమవారం ఆయన మళ్లీ కోర్టుకెక్కారు. తాను అదనపు సమాచారం కోసం పిటిషన్ వేశానని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాగా, బిజెపి తెలంగాణకు అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications