టీ నుండి సమైక్య ఉద్యమం, ఆదాయం తగ్గుతోంది: జేసీ
హైదరాబాద్: అనంతపురం పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ నేత జేసీ దివాకర్ రెడ్డి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో ఆసక్తికరమైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి సమైక్య రాష్ట్ర ఉద్యమం తెలంగాణ రాష్ట్రం నుండే వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణానికి ఆయన వచ్చారు.
మాజీ మంత్రి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావుతో పిచ్చాపాటిగా మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆదాయం పడిపోతోందని అభిప్రాయపడ్డారు. అయితే, దానికి కారణం మాత్రం తెలియదని చెప్పారు.
ఇక తాను ఏ పార్టీలోకి మారనని స్పష్టం చేశారు. ఇక రాజకీయాల నుండి రిటైర్మెంట్ మాత్రమే ఉందన్నారు. రాజకీయాల్లో వారసత్వం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మనం ఏమైనా రాచరిక వ్యవస్థలో ఉన్నామా అన్నారు. వారసత్వం ఉండకూడదని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో బ్యాంకర్లు రుణాల గురించి అడగనంత వరకు తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు. అనంతపురం జిల్లాలో రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు.తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చినా కేసీఆర్కి అధికారం అప్పగించారని జేసీ ఆన్నారు. దీనికి వీహెచ్ తెలంగాణ ఇచ్చిన విషయాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోయామన్నారు.
తెలంగాణ ఇచ్చి ఇక్కడ, పచ్చని రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆంధ్రప్రదేశ్లోనూ కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయిందన్నారు. గీతారెడ్డి ఉన్నత పదవులు అలంకరిస్తారనుకున్నానని జేసీ పేర్కొన్నారు. ప్రజలకు వాస్తవాలు అర్థమవుతున్నాయని, రానున్న రెండేళ్లలో సమైక్య ఉద్యమం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని జేసీ వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నుండి వచ్చిన నేతలతో టీడీపీ లోడ్ అయిందన్నారు.
వివిధ పార్టీల్లోని అసంతృప్త నేతలకు బీజేపీ వేదిక అయిందన్నారు. ఇందిర కన్నా మోడీ పవర్ ఫుల్ పీఎం అన్నారు. ఎన్నికల ముందు మోడీ వేరు, ఇప్పటి మోడీ వేరు అన్నారు.రాయల తెలంగాణ అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేదన్నారు. ఆయన వీహెచ్, గీతారెడ్డిలతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
కాగా, జేసీ దివాకర్ రెడ్డి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచి పెట్టుకుపోతుందని భావించిన జేసీ దివాకర్ రెడ్డి సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు.