టిపై క్లీన్బౌల్డా, వృథానా: కిరణ్ ముందు 3 బంతులు
హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరి బంతి ఏమిటి? ఆయన ఏం చేస్తారనే ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశమైంది. విభజనపై చివరి బంతి వరకూ వేచి చూడండంటూ క్రికెట్ పరిభాషలో పదేపదే చెప్పిన కిరణ్, ఇప్పుడు ఏమి చేయబోతున్నారన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాను సిఎంగా ఉన్నంతవరకూ విభజన జరగనివ్వనని, అవసరమైతే కేంద్రాన్ని కూడా ఎదిరిస్తానని ఆయన చెప్పారు.
విభజనను అడ్డుకునే క్రమంలో ముఖ్యమంత్రి రాజీనామా చేయడం, శాసన సభను ముందుగానే రద్దు చేయడం, అసెంబ్లీ ముగిసిన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం వంటివి ఉండొచ్చని ప్రచారం సాగుతోంది. ఈ మూడింటి పైన ప్రధానంగా చర్చ సాగుతోంది.
శాసనసభ సమావేశాలకు ముందే రాజీనామా చేయడం ఒక ఆలోచన అయితే, ముసాయిదా బిల్లుపై చర్చ జరిగే సమయంలో విభజనతో నష్టాలు, కష్టాలను వివరించి తరువాత పదవికి రాజీనామా చేయవచ్చన్న భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. శాసనసభకు ముందుగానే రాజీనామా చేస్తే మొత్తం మంత్రి వర్గం రద్దవుతుందని, దీంతో రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుందన్న భావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేస్తున్నారట.
దీంతో కొత్త ముఖ్యమంత్రిని సిఎల్పీలో ఎన్నుకుని, గవర్నర్ వద్ద ప్రమాణ స్వీకారం, మంత్రుల ప్రమాణస్వీకారం వంటి అంశాలు పూర్తి చేసేందుకు కొంత సమయం అవసరమవుతుందని, దీనివల్ల శాసనసభ వాయిదా పడే అవకాశాలు ఉంటాయని కిరణ్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.
ముఖ్యమంత్రి హోదాలో మొత్తం శాసనసభను రద్దు చేయడం కూడా ఒక ఆలోచనగా కనిపిస్తోంది. దీని ద్వారా రాష్టప్రతి పాలన వస్తుందని, ఈ కారణంగా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు సాంకేతిక సమస్యలు ఉత్పన్నం అవుతాయని అంచనా వేస్తున్నారట. అయితే అసెంబ్లీ రద్దు చేయాలంటే మంత్రివర్గ తీర్మానం అవసరమని, దీనికి ఎంతమంది సీమాంధ్ర మంత్రులు సానుకూలంగా స్పందిస్తారనే అంశంపై చర్చ సాగుతోందని తెలిసిందే.
అసెంబ్లీ రద్దుపై తాను ముఖ్యమంత్రికి ఈ సలహా ఇచ్చినట్టు సమైక్యవాదాన్ని బలంగా వినిపిస్తున్న మంత్రి టిజి వెంకటేశ్ స్వయంగా చెప్పారు. అసలు అసెంబ్లీ లేకపోతే బిల్లు చర్చకు రాదని, పార్లమెంట్లోనూ బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆస్కారం ఉండదని చెప్పినట్టు ఆయన వెల్లడించడం గమనార్హం. అప్పటికీ పార్లమెంట్లో ప్రవేశపెడితే భారత ప్రజాస్వామ్యంలో ఆ రోజు బ్లాక్ డేగా మిగిలిపోతుందని అభిప్రాయపడ్డారు. అందుకే ముఖ్యమంత్రి కిరణ్ ఈ దిశగానూ ఆలోచన చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
అసలు శాసనసభకు రాకుండా చూసే అంశాలపై కూడా కిరణ్ దృష్టి సారించే అవకాశాలు ఉండొచ్చునంటున్నారు. ఇక చివరి అస్త్రంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపైనా సమాలోచనలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. మెజార్టీ ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా రాష్ట్ర విభజన జరగడం సరికాదంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.