విభేదాలు పెరిగిపోయాయి, నాపై బురద: ఊసెండి
హైదరాబాద్: ఆరోగ్య సమస్యల వల్ల, తన అభిప్రాయాలకు పార్టీ సానుకూలంగా స్పందించకపోవడం వల్ల తాను పార్టీ నుంచి బయటకు వచ్చానని పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత ఉసెండి తెలియజేశారు. సోమవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎప్పుడూ పార్టీ ఆదేశాల మేరకు పనిచేశానని చెప్పారు.
పార్టీని వదిలేయాలని నిర్ణయించుకున్న తర్వాత తన జీవితంపై బురద జల్లుతారని ఊహించలేదని ఉసెండి తెలిపారు. పార్టీని వదిలినంత మాత్రాన పార్టీకి తానేదో శత్రువును కాదని, పార్టీకి నష్టం కలిగించాలన్న దురుద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు,సమాజానికి నష్టం చేకూర్చడానికి తాను బయటకు రాలేదని, 30 ఏళ్లుగా ఉద్యమంలో పనిచేసిన వ్యక్తిగా ప్రజా సమస్యలపై అవగాహన ఉంది, దానికి అనుగుణంగా కృషి చేస్తానని తెలిపారు.
మావోయిస్టు పార్టీలో విభేదాలు పెరిగిపోయాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీ పనిచేయడం లేదని అన్నారు. విభేదాలపై పార్టీ వేదికలపై చర్చించానని, దానికి సంతృప్తికరమైన సమాధానం రాలేదని అన్నారు. పార్టీ నుంచి భౌతిక దాడి జరుగుతుందని ఆందోళన చెందడం లేదని తెలిపారు. తన వ్యక్తి గత జీవితాన్ని బహిరంగపర్చడం సరికాదని, తనపై విమర్శలకు సమాధానం ఇస్తున్నాని ఉసెండి చెప్పారు.
దండకారుణ్యంలో మావోయిస్టు పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని, ప్రజాబలం తగ్గుతోందని అన్నారు. ఎందికిలా జరుగుతుందో పార్టీ ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వంతో చర్చల తర్వాత మావోయిస్టులు ఘోరంగా దెబ్బతిన్నారని విమర్శలు ఉన్నాయని, అయితే ప్రభుత్వంతో చర్చలకు ముందే ఆ పునాదులు పడ్డాయని వెల్లడించారు. నష్టం జరిగిన తర్వాత పార్టీ విషయాన్ని గుర్తించిందని ఉసెండి తెలియజేశారు.