చంద్రబాబుకు హెచ్చరిక: 'హెరిటేజ్ ఇష్యూ కాదు, తేడా వస్తే సింగపూర్ వెళ్లాలి'
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు సోమవారం డిమాండ్ చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
వేల కోట్ల విలువైన రాజధాని భూములను బలవంతంగా రైతుల నుంచి లాక్కొని అప్పనంగా సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు దోచిపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. ముఖ్యమంత్రికి ఆ భూములపై అంత మక్కువ ఎందుకు అని ప్రశ్నించారు. ఇందులో ఏదో ఉందని సందేహం వ్యక్తం చేశారు. సింగపూర్, ఏపీ ప్రభుత్వం మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పాలన్నారు.
చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వానికి, సింగపూర్ కంపెనీలకు జరిగిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ఆ కంపెనీలతో జరిగిన ఒప్పందాన్ని రహస్యంగా ఉంచేందుకు ఇది చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వ్యవహారం కాదని చెప్పారు.
అది హెరిటేజ్ వ్యవహారం కాదు
అమరావతి భూములు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందం అంతా ప్రజలకు సంబంధించిన వ్యవహారమని వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. దీనిపై ప్రజలకు కచ్చితమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం సింగపూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు.
తేడా వస్తే బాధ్యతలు ఎవరు తీసుకుంటారు
ఇప్పుడు మళ్లీ వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోందని వడ్డే అన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాల సంగతి ఏమయిందో చెప్పాలన్నారు. ఒప్పందాల్లో తేడాలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. పైగా సింగపూర్ కంపెనీలకు భారత చట్టాలు వర్తించవని ఆయన గుర్తు చేశారు.
తేడా వస్తే సింగపూర్ వెళ్లవలసిందే
ఒప్పందాల విషయంలో ఏవైనా తేడాలు వస్తే అప్పుడు సింగపూర్ వెళ్లవలసిందేనని వడ్డే శోభనాద్రీశ్వర రావు హెచ్చరించారు. ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు, ఇష్టం వచ్చిన వారికి, నచ్చిన వారికి దోచిపెడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.