Vaikunta Ekadasi 2022: టీటీడీ గుడ్న్యూస్: వైకుంఠ ద్వార దర్శనంపై కీలక నిర్ణయం
తిరుపతి: గురువారం వైకుంఠ ఏకాదశి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్నీ భక్తుల కోలాహలంతో నిండిపోయే ప్రత్యేక సందర్భం. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి విధించిన ఆంక్షల మధ్య ఈ సంవత్సరం కూడా ఈ పెద్ద పండగను జరుపుకోవాల్సి వస్తోంది. ఆలయాలను సందర్శించడానికి వచ్చే భక్తుల కోసం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. దేవాదాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యలో పనులు పూర్తయ్యాయి.
Recommended Video

ముక్కోటి ఏకాదశి..
సూర్య భగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీన్నే ముక్కోటి ఏకాదశిగా పిలుస్తారు. శ్రీమహావిష్ణువు గరుడ వాహనరూఢుడై మూడు కోట్ల దేవతలతో కలిసి భూలోక సంచారానికి వస్తాడని, భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ పండగకు ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చింది.

10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం..
శ్రీవారిని దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వేలాదిమంది భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని కొనసాగించనున్నారు. ఎలాంటి సిఫారసు లెటర్లు చెల్లుబాటు కావంటూ టీటీడీ అధికారులు ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం, ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకున్న విధంగానే స్వామివారి దర్శనాన్ని కల్పిస్తామని స్పష్టం చేశారు.

లక్షన్నరమందికి పైగా..
సామాన్యులకు స్వామివారి దర్శనాన్ని కల్పించడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు టీటీడీ అధికారులు. దీనికి అనుగుణంగా సన్నాహాలు పూర్తి చేశారు. ఈ 10 రోజుల్లో కనీసం లక్షన్నర మంది శ్రీవారి భక్తులకు వైకుంఠ ద్వారం గుండా స్వామివారి దర్శనాన్ని కల్పించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. 14వ తేదీన ద్వాదశితో పాటు మిగిలిన ఎనిమిది రోజులు భక్తులకు ఎలాంటి లోటు రానివ్వకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.

కోవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి..
భక్తులు అధిక సంఖ్యలో ఉండే ప్రాంతాలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూ లైన్లు, శ్రీవారి ఆలయంలో శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రతి ఒక్క భక్తుడు, టీటీడీ ఉద్యోగులు, ఇతర సిబ్బంది తప్పనిసరిగా మాస్క్ ధరించేలా చర్యలు తీసుకున్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో క్యూ లైన్, శ్రీవారి అంతరాలయంలో భక్తులు భౌతిక దూరాన్ని తప్పనిసరిగా పాటించేలా ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో తోపులాట చోటు చేసుకోకుండా ఉండటానికి సర్కిళ్లను వేశారు.

2020 నుంచి
ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఇవాళ అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. 2020లో తొలిసారిగా శ్రీవారి ఆలయంలో 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ అధికారులు ప్రారంభించారు. దాన్ని కొనసాగిస్తోన్నారు. ఇప్పటికే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులకు టోకెన్లను జారీ చేశారు. రోజుకు 20 వేల మందికి 300 రూపాయల టికెట్లు, అయిదువేల మందికి ఆఫ్ లైన్ ద్వారా, మరో అయిదు వేల మందికి ఆన్లైన్లో ఉచిత దర్శనం టోకెన్లను ఇచ్చారు. శ్రీవాణి ట్రస్ట్, వీఐపీల కోసం అదనంగా దాదాపు మరో 10 వేల టిక్కెట్లను జారీ చేయాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications