కలియుగ వైకుంఠం..కొండ నిండా జనం
Vaikunta Ekadasi 2025: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
వైకుంఠ ఏకాదశిలో భాగంగా గురువారం తెల్లవారు జామున 4:30 గంటలకు వీఐపీ ప్రొటోకాల్, ఉదయం 8 గంటలకు సామాన్య భక్తుల కోసం శ్రీవారి దర్శనం ఆరంభమైంది. 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలుగనుంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని స్వర్ణ రథంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల గుండా ఊరేగుతూ భక్తులను కరుణించారు. గోవిందుడి నామస్మరణతో తిరుమల మార్మోగిపోయింది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య కన్నుల పండువగా బంగారు రథం ఊరేగింపు కొనసాగింది.
ఆనంద పారవశ్యంతో రథాన్ని లాగుతూ నారాయణుడి సేవలో భక్తులు తరించారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యురాలు సుచిత్రా ఎల్లా, అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
తొలి రోజే 80 వేలమందికి పైగా స్వామివారిని దర్శించుకున్నారు. 19వ తేదీ వరకు ఏడు నుంచి ఎనిమిది లక్షలమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు మార్గదర్శకాలను సైతం ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే.

దర్శనం టోకెన్లు లేదా టికెట్లు కలిగిన భక్తులకు మాత్రమే క్యూ లైన్లలోకి అనుమతి ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. టోకెన్లు/టికెట్లు లేని భక్తులకు క్యూలైన్లో ప్రవేశం ఉండదు. అవి లేని వాళ్లు తిరుమలకు రావొచ్చు గానీ శ్రీవారి దర్శనం మాత్రం లభించదు. టోకెన్లు/టికెట్లు ఉంటేనే స్వామివారిని దర్శించుకోవచ్చు. 19వ తేదీ వరకు శ్రీవారి మెట్లు కౌంటర్లను మూసివేశారు.
తిరుపతి, తిరుమలల్లోని కౌంటర్లల్లో ఇప్పటికే 12వ తేదీ వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన రోజులకు అంటే 13 నుంచి 19వ తేదీ వరకు దర్శనాలకు సంబంధించి టోకెన్లు శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణువాసం, భూదేవి కాంప్లెక్స్లల్లో ఏరోజుకారోజు ఇస్తారు.
తిరుమలలో పరిమిత సంఖ్యలో వసతి గదులు అందుబాటులో ఉన్నందున భక్తులు తాము పొందిన టోకెన్లల్లో పేర్కొన్న తేదీ, సమయం ప్రకారం మాత్రమే శ్రీవారి దర్శనానికి రావాల్సి ఉంటుంది. ఎక్కువమంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శన భాగ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఈ 10 రోజుల పాటు ఎలాంటి సిఫారసు లేఖలను టీటీడీ అధికారులు స్వీకరించరు.












Click it and Unblock the Notifications