వైకుంఠ ద్వార దర్శనాల వేళ.. తిరుమలలో కీలక ఘట్టం
Vaikunta Dwadasi 2025: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 60,094 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 14,906 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.45 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠ ఏకాదశిలో భాగంగా గురువారం తెల్లవారు జామున 4:30 గంటలకు వీఐపీ ప్రొటోకాల్, ఉదయం 8 గంటలకు సామాన్య భక్తుల కోసం శ్రీవారి దర్శనం ఆరంభమైంది. 19వ తేది వరకు శ్రీనివాసుడిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకునే భాగ్యం లక్షలాది మంది భక్తులకు కలుగనుంది. దీనికోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని స్వర్ణ రథంపై ఊరేగారు. నాలుగు మాడ వీధుల గుండా ఊరేగుతూ భక్తులను కరుణించారు. గోవిందుడి నామస్మరణతో తిరుమల మార్మోగిపోయింది. వేలాదిమంది భక్త జన సందోహం మధ్య కన్నుల పండువగా బంగారు రథం ఊరేగింపు కొనసాగింది.
వైకుంఠ ద్వాదశి సందర్భంగా చక్రస్నానం కార్యక్రమాన్ని వైభవోతంగా నిర్వహించారు టీటీడీ అర్చకులు. ఈ తెల్లవారు జామున వేదమంత్రోచ్ఛారణల మధ్య శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్ను పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. తిరుమల చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామి పుష్కరిణిలోని పవిత్ర జలాల్లో చక్రస్నానం నిర్వహించారు. అనంతరం చక్రత్తాళ్వార్ తిరిగి ఆలయానికి తీసుకెళ్లారు.

స్వామి పుష్కరిణిని ముక్కోటి తీర్థాల్లో ఒకటిగా పరిగణిస్తారు. తిరుమలలో నిర్వహించే వేడుకల్లో చక్రస్నానానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శేషాచలంలో ఉన్న 66 కోట్ల తీర్థాలకు పుష్కరిణిని ప్రధాన మూలంగా భావిస్తారు. ఈ కార్యక్రమంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్యామలరావు, బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి పాల్గొన్నారు.
కాగా- 19వ తేదీ వరకు కొనసాగే వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా ఏడు నుంచి ఎనిమిది లక్షలమంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారులు అంచనా వేశారు. దీనికి అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టారు. వైకుంఠ ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ అధికారులు మార్గదర్శకాలను సైతం ఇదివరకే జారీ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications