డీజీపీని కలిసిన వల్లభనేని వంశీ: టీడీపీ నేతలకు వార్నింగ్
విజయవాడ: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గురువారం కలిశారు. ఈ సందర్భంగా సంకల్ప సిద్ధి గొలుసుకట్టు మోసం వ్యవహారంపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కోరారు. తన పరువుకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు.
ఇప్పటికే ఇద్దరు నేతలకు లీగల్ నోటీసులు పంపానని, వారు స్పందించకుంటే హైకోర్టుకు వెళ్తానని తెలిపారు. సంకల్ప సిద్ధి మార్ట్ గొలుసుకట్టు మోసం వ్యవహారంలో తనకు ఎటువంటి సంబంధం లేదని వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు కావాలనే తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రూ. 11వేల కోట్ల ఆరోపణలు చేసే ముందు ఆధారాలు చూపాలని, కానీ అవన్నీ లేకుండా అర్ధరహితంగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆరోపణలపై సీఐడీ విచారణ కోరతానని వంశీ తెలిపారు. దీనిపై కోర్టును కూడా ఆశ్రయిస్తానని పేర్కొన్నారు. తనకు సంకల్పసిద్ది పేరు.. అందులో మనుషులు తెలియదంటూ స్పష్టంచేశారు. మీడియాలో తనపై, కొడాలి నానిపై ఆరోపణలు చేశారని.. దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.
ఆధారాలు చూపాలని, లేకుంటే కోర్టుకు సమాధానం చెప్పాలని వంశీ స్పష్టంచేశారు. ఆధారాలు చూపండి లేకుంటే క్షమాపణ చెప్పండంటూ టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు వల్లభనేని వంశీ. వారు క్షమాపణ చెప్తారో జైలుకు వెళ్తారో తేల్చుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications