బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తారా?: వంశీ, నన్ను హాట్గా చూపించాలనే: రోజా
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి, విజయవాడ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీ సోమవారం అన్నారు. వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలతో వేధించడం సరికాదన్నారు.
ఓ నిందితుడు చేసిన పనితో విజయవాడకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కాల్ మనీ పైన కఠిన చర్యలకు చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: జ్యోతుల
స్పీకర్ అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఆరోపించారు. స్పీకర్ పచ్చ కండువా కప్పుకొని పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రోజా వ్యవహారాన్ని ప్రివిలేజ్ కమిటీకి అప్పగిస్తే బాగుండేదన్నారు. మా సభ్యులు సహనాన్ని కోల్పోయి మాట్లాడి ఉండవచ్చునని, సీఎం మా అంతు చూస్తామని బెదిరించడం సరికాదన్నారు.
కాగా, రోజా వేరుగా మాట్లాడుతూ... తనను సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోను హాట్ హాట్గా చూపించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు తహతహలాడుతున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తాను నోరు జారలేదని, మా కంటే టిడిపి వాళ్లే ఎక్కువ బూతులు తిట్టారన్నారు.
తనను టార్గెట్ చేసి నేను ఏదో చేసినట్లు సభ్యులతో పాటు మంత్రులు, ముఖ్యమంత్రి, చివరకు స్పీకర్ కూడా వాళ్ల ప్రకటనలు రికార్డ్ చేస్తున్నారని, ఒక అబద్దాన్ని వందసార్లు చెబితే నిజమవుతుందన్నట్లు వారి తీరు ఉందన్నారు.
తనను సినిమాల్లో చాలా హాట్గా చూపించారని, అలాగే రాజకీయాల్లో కూడా చూపించాలని కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తనను ఎలాగోలా రాజకీయాల నుంచి తరిమేయాలని చూస్తున్నారన్నారు. వీటన్నింటిని చూస్తుంటే నేను ఇంత పెద్ద నేతను అయ్యానా? నన్ను అంత టార్గెట్ చేస్తున్నారా? అనిపిస్తోందన్నారు.