తేల్చుకుందాం రా!: విష్ణు వర్సెస్ వంశీచంద్, ఫిర్యాదుపై డీసీపీ
హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి వర్గాల నుండి ఫిర్యాదులు అందాయని డీసీపీ రమణ కుమార్ తెలిపారు. తమను పట్టించుకోలేదన్న విష్ణు ఆరోపణలలో నిజం లేదని ఆయన చెప్పారు. గన్ తీశాడని విష్ణు ఫిర్యాదు చేశారని, విచారణ చేస్తున్నామన్నారు. అలాగే తన పైన దాడి చేశాడని వంశీ ఫిర్యాదు చేశారన్నారు. వారి పైన 344, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ఆరోపణలు చేయడం చాలా సులభమని డీసీపీ చెప్పారు. ఒకరు ఫిర్యాదు చేస్తుండగా మరొకరికి ఎలా కుదురుతుందని చెప్పారు. మరో ఫిర్యాదుదారు ఎక్కడ ఫిర్యాదు చేస్తే తాను అక్కడే ఫిర్యాదు చేస్తానని పట్టుబడితే ఎలా అన్నారు. ఇరువర్గాల నుండి ఫిర్యాదులు అందాయన్నారు.
విష్ణువర్దన్, వంశీచంద్ సవాళ్లు, ప్రతిసవాళ్లు
వంశీచందర్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా తమ పైన దాడి చేశారని, తనకు గన్ చూపించారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు పట్టించుకోలేదన్నారు. వంశీచంద్ రెడ్డి తీరు పైన అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పెళ్లికి పిలవకుండానే వంశీచంద్ వచ్చారన్నారు.
విష్ణు తన గన్మెన్ను కొట్టారని వంశీచంద్ రెడ్డి ఆరోపించారు. కాగా, గొడవకు దిగాలనుకుంటే హైదరాబాదు నడిబొడ్డునైనా, మహబూబ్నగర్ జిల్లాలో అయినా తాను సిద్ధమని సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నట్లుగా తెలుస్తోంది. తాను హైదరాబాదీనని, పీజేఆర్ కుమారుడినని, చేతనైతే రావాలని విష్ణు సవాలు విసిరారు.
బెదిరించారు: విష్ణు తల్లి
వంశీచంద్తో తమకు గతంలో ఎలాంటి విభేదాలు లేవని, ఆయన తన తనయుడు విష్ణును చంపేందుకే వచ్చినట్లుగా కనిపిస్తోందని విష్ణు తల్లి ఆరోపించారు. వంశీచంద్ రెడ్డి వెనుక ఎవరు ఉన్నారో తెలియాలన్నారు. ఇదిలా ఉండగా, వీరిద్దరికి యూత్ కాంగ్రెస్లో పని చేసినప్పుడు గొడవ వచ్చిందని, అప్పటి నుండి అది అలాగే ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
కాగా, ఎన్ కన్వెన్షన్ సెంటరులో విష్ణు బావమరిది పెళ్లి జరుగుతోంది. ఈ సమయంలో వంశీచంద్ వచ్చారు. ఆయన వస్తుండగా గన్మెన్లు సార్ వస్తున్నాడు.. జరగండి అని విష్ణుతో అన్నారు. ఇది విష్ణు, వంశీచంద్ మధ్య ఘర్షణకు దారి తీసింది.