తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ సిద్దం - ట్రయిల్ రన్ పూర్తి : ఆ రెండు స్టేషన్ల మధ్య..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. దీనికి సంబంధించి ట్రయిల్ రన్ పూర్తయింది.
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్ సిద్దం అవుతోంది. ఇప్పటికే సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ - వైజాగ్ ల మధ్య ప్రారంభమైన వందేభారత్ కు మంచి స్పందన కనిపిస్తోంది. దక్షిణ మధ్య రైల్వేకు మూడు వందేభారత్ రైళ్లను ఖరారు చేసారు. అందులో మొదటి రైలు ఫిబ్రవరి మాసంలోనే పట్టాలెక్కేందుకు సిద్దం అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో డిమాండ్ ఉన్న లైన్ల గురించి రైల్వే శాఖ ఆరా తీసింది. అందులో భారీ డిమాండ్ ఉన్న మూడు లైన్లలో కొత్తగా వందేభారత్ తీసుకురావాలని డిసైడ్ అయింది. అందులో భాగంగా సికింద్రాబాద్ - తిరుపతి మార్గం లో ట్రయిల్ రన్ పూర్తి చేసారు. ఈ నెలాఖరులోగా ఈ లైన్ లో వందే భారత్ పట్టాలెక్కనుంది.

ఈ నెలలోనే ప్రారంభం
తెలుగు రాష్ట్రాల నుంచి భారీ డిమాండ్ ఉన్న లైన్లలో సికింద్రాబాద్ - తిరుపతి ప్రధానమైనది. నిత్యం లక్షలాది మంది తిరుపతికి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో నిత్యం తిరమలకు ప్రయాణాలు చేస్తారు. దీంతో..ఇప్పుడు ఈ రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్ - తిరుపతి-సికింద్రాబాద్ లైన్ లో వందేభారత్ ప్రారంభించేందుకు రంగం సిద్దమైంది. సికింద్రాబాద్ నుంచి పూణే, కాచిగూడ నుంచి బెంగుళూరు, సికింద్రాబాద్ నుంచి తరుపతి మూడు వందే భారత్ రైళ్లకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. అందులో ఒకటైన సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ ఫిబ్రవరిలోనే పట్టాలు ఎక్కేందుకు సిద్దమవుతోంది. దీంతో..రెండు నెలల సమయంలో సికింద్రాబాద్ నుంచి వరుసగా రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.

పూర్తయిన ట్రయిల్ రన్..
సికింద్రాబాద్-తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్ప్రెస్ సేవలు లాంచనంగా ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా ఆదివారం ఈ రూట్లో ముందస్తుగా ట్రయిల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ లో ఈ రైలు చెన్నైలో బయల్దేరి గూడూరుకు రాత్రి 2 గంటలకు చేరుకుంది. అక్కడ్నించి బయల్దేరి ఒంగోలుకు ఉదయం 5.20 గంటలకు చేరుకుంది. చీరాలకు ఉదయం 6.25 గంటలకు, విజయవాడకు 8.25 గంటలకు చేరుకుంది. ఇప్పటికే ప్రారంభించిన సికింద్రాబాద్ - విశాఖ మధ్య వందేభారత్ విజయవాడ మీద కొనసాగుతోంది. దీంతో.. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త గా ట్రయిల్ రన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నుంచి తిరుపతి మధ్య ఎక్కవ సంఖ్యలో రైళ్లు ఉన్నాయి. ఈ రైళ్ల సమయాలను పరిగణలోకి తీసుకొని సికింద్రాబాద్ - తిరుపతి వందేభారత్ రైలు షెడ్యూల్.. రాక పోకల సమయాలు ఖరారు చేయనున్నారు.

తగ్గనున్న ప్రయాణ సమయం.. ధరలు మాత్రం
ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తరుపతి ప్రయాణానికి సూపర్ ఫాస్ట్ రైళ్లల్లో దాదాపుగా 12 గంటల సమయం పడుతోంది. వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే ఆ సమయం రెండు గంటల వరకు తగ్గే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, వందేభారత్ రైళ్లో ఛార్జీల భారం కూడా ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు ఛార్జీలు ఎక్కువగా ఉన్నా..ఆదరణ మాత్రం క్రమేణా పెరిగింది. ముఖ్యంగా విశాఖ నుంచి సికింద్రబాద్ కు వస్తున్న రైలుకు స్పందన బాగుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా వందేభారత్ రైల్లో ప్రయాణిస్తున్న వారి నుంచి దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు స్వయంగా ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రారంభం కానున్న వందేభారత్ రైలుకు సంబంధించి త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications