సంతకం పెట్టిన హోం మంత్రి వంగలపూడి అనిత
KGH Visakhapatnam: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు అయిదు గ్యారంటీలపై సంతకాలు చేశారు.
మంత్రులు ఇంకా పూర్తిస్థాయిలో బాధ్యతలను స్వీకరించలేదు. ఒక్కొక్కరుగా ఛార్జ్ తీసుకుంటోన్నారు. ఇప్పటివరకు అయిదుమంది సచివాలయంలో అడుగు పెట్టారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇదివరకే ఛార్జ్ తీసుకున్నారు.

తాజాగా- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. కొద్దిసేపటి కిందటే ఆయన సచివాలయంలో తన ఛాంబర్లో పూజాదికాలను నిర్వహించి ఛార్జ్ తీసుకున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అడవులు, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు ఆయన వద్ద ఉన్నాయి.
అదే సమయంలో హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కొద్దిసేపటి కిందటే బాధ్యతలను చేపట్టారు. వెలగపూడి సచివాలయం బ్లాక్-2లో గల ఛాంబర్లో ఆమె ఛార్జ్ తీసుకున్నారు. అంతకుముందు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య సంతకం పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆమె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
వంగలపూడి అనిత తన క్యాంప్ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. న్యూ ఆటోనగర్లో పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్కు చెందిన నాలుగు అంతస్తుల భవనాన్ని ఆమె అద్దెకు తీసుకున్నారు. మంగళవారం తన కుమార్తెతో కలసి గృహప్రవేశం చేశారు.
మొన్నటి ఎన్నికల్లో అనిత.. పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కంబాల జోగుళును 43 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడించారు. చంద్రబాబు కేబినెట్లో కీలకమైన హోం మంత్రిత్వ శాఖను దక్కించుకున్నారు.












Click it and Unblock the Notifications