రంగా, పరిటాల హత్యలపై బాబును ఏకేసిన వంగవీటి
విజయవాడ: వంగవీటి రంగా హత్య కేసులో తెలుగుదేశం పార్టీ నేతలే ముద్దాయిలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణ బుధవారం ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందని, దానికి ఎవరు బాధ్యులను ప్రశ్నించారు. ప్రస్తుత సభాపతి కోడెల శివప్రసాద రావు అప్పుడు ఎందుకు రాజీనామాీ చేశారో అన్ని విషయాలు ప్రజలకు తెలుసునన్నారు.
పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలున్న జేసీ దివాకర్ రెడ్డి సోదరులను టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును పరిటాల సునీత అడగాలని సూచించారు. వంగవీటి మోహనరంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలుగా ఉన్నారన్నారు. ప్రజలకిచ్చిన హామీల సంగతి అడిగితే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలను టీడీపీ టార్గెట్ చేస్తోందన్నారు.
టీడీపీ చేస్తున్న ఆరోపణలపై న్యాయ, సీబీఐ విచారణకు సిద్ధమని రాధా సవాలు విసిరారు. అవాకులు చవాకులు పేలడం మానేసి ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి పెట్టాలన్నారు. రంగా హత్య కేసు కొట్టివేసినంత మాత్రాన దోషులు నిర్దోషులు కారన్నారు. శాసన సభలో చర్చను దారి మళ్లించేందుకు టీడీపీ పదేపదే పరిటాల రవి హత్య కేసును తెరపైకి తీసుకు వస్తోందన్నారు.
కాగా, పరిటాల రవి హత్య కేసును తిరగదోడితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మొదటి ముద్దాయి అవుతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత చేసిన వ్యాఖ్యపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పరిటాల రవి హత్య కేసుపై అప్పట్లో శాసనసభలో చర్చించారని, వైయస్ జగన్పై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిదుల సమావేశంలో గుర్తు చేశారు.
వంగవీటి రంగా హత్య కేసును తిరగదోడితే చంద్రబాబు మొదటి ముద్దాయి, శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు రెండో ముద్దాయి అవుతారని ఆయన ఆరోపించారు. వంగవీటి హత్య కేసులో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, కోడెల శివప్రసాదరావులపై ఆరోపణలు వచ్చాయన్నారు. ఇలాంటి రాజకీయ ఆరోపణలు రుజువు కాకపోవడం వల్లనే వారు పదవుల్లో ఉన్నారని ఆయన అన్నారు.
పరిటాల రవి హత్య కేసు తిరుగదోడుతామని చెబుతున్న టిడిపి నాయకులు వంగవీటి రంగా హత్య కేసుపై మళ్లీ విచారణకు సిద్ధపడుతారా అని అంబటి రాంబాబు అడిగారు. వంగవీటి హత్యతో పాటు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఇతర రాజకీయ హత్యలకు సంబంధించిన కేసులను తిరగదోడేందుకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశం పార్టీ అసంబద్ధంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు.