వంగవీటి రంగా హత్య: ఎలా జరిగింది, ఆ తర్వాతేమైంది?
విజయవాడ: ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో వంగవీటి హత్య ఓ పెద్ద సంచలనం. రంగా హత్య తర్వాత విజయవాడ హింసాకాండను చవిచూసింది. దాదాపు 40 రోజుల పాటు అట్టుడికిపోయింది. రంగా 1988 డిసెంబర్ 26వ తేదీన హత్యకు గురయ్యాడు. మాజీ మంత్రి హరిరామ జోగయ్య తన ఆత్మకథ ద్వారా రంగా హత్యోదంతాన్ని చర్చనీయాంశం చేశారు.
వంగవీటి రంగా సోదరుడు వంగవీటి రాధాకృష్ణ కమ్యూనిస్టుల చేతుల్లో హతమయ్యాడు. దీంతో వంగవీటి రంగా తన సోదరుడి స్థానంలో నాయకత్వంలోకి వచ్చాడు. కాపులు రంగాను తమ తిరుగులేని నాయకుడిగా పరిగణించారు. అయ్యప్ప మాల వేసుకుని వచ్చిన దుండగులు నిరాహార దీక్షలో ఉన్న రంగాను హత్య చేశారు. ఈ హత్య తర్వాత విజయవాడలో అల్లర్లు చెలరేగాయి. దీంతో విజయవాడ నగరంలో 40 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగింది.
1985 ఎన్నికల్లో జైలులో ఉండే కంగా కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. హత్య జరిగిన వెంటనే బాధ్యత వహిస్తూ హోం మంత్రిగా కోడెల శివప్రసాద రావు రాజీనామా చేశారు. రెండు సామాజిక వర్గాల మధ్య విజయవాడలో పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే స్థితిలో రంగా హత్య జరిగింది.
రంగా హత్య జరిగిన తర్వాత చెలరేగిన అల్లర్లలో పెద్ద యెత్తున ప్రాణ నష్టం జరిగింది. వంద కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి.
ఎన్టీ రామారావు సోదరుడికి చెందిన సినిమాలను ధ్వంసం చేశారు. కానీ, వైయస్ రాజశేఖర రెడ్డికి చెందిన రెండు సినిమా థియేటర్లకు కూడా ఏమీ జరగలేదు. ఒక వర్గంవారి ఆస్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి.