మిస్టరీగా మారిన కాశీ యాత్ర.. ఏడుగురు మిస్సింగ్..
తానోటి తలిస్తే.. దైవమొకటి తలిచినట్టు.. పుణ్యక్షేత్రాలు దర్శించుకుని రావాలనుకున్న వ్యక్తుల బృందం అదృశ్యమైపోవడం ఉత్కంఠను రేపుతోంది. అసలు కారణాలేంటో ఇంతవరకు తెలియరాలేదు గానీ.. బృందంలోని ఒక యువకుడు చెప్తున్న దాని ప్రకారం యాత్ర కాస్త పెద్ద మిస్టరీగా మారిపోయింది. సగం యాత్ర కూడా పూర్తవకుండానే దర్శనానికి వెళ్లిన బృందంలో ఒక్క వ్యక్తి తప్ప మిగిలినవారంతా అదృశ్యమయ్యారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు బయల్దేరి వెళ్లిన భక్తుల బృందంలో ఏడుగురు వ్యక్తులు ఏమైపోయారో తెలియడంలేదు. బృందంలోని ఒక యువకుడు మాత్రం తలకు తీవ్రమైన గాయాలతో వారణాసి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. కాకినాడలోని గొల్లపేట ప్రాంతానికి చెందిన 8 మంది కాశీ యాత్ర కోసం బయలుదేరారు. ముందుగా సామర్లకోట నుంచి విజయవాడ వెళ్లిన బృందం, అక్కడినుంచి రైల్లో వారణాసికి బయల్దేరారు. వీరిలో ఆరుగురూ మహిళలే కావడం గమనార్హం. మే 1వ తేదీ ఉదయం సరిగ్గా 12 గంటల ప్రాంతంలో బృందమంతా కాశీకి చేరుకున్నారు. అక్కడ త్వరగా దర్శనం చేసుకుని అక్కడినుంచి నేరుగా గయాకు వెళ్ళాలని భావించారు. కానీ కాశీలో దర్శనం ఆలస్యం కావడం వల్ల రాత్రి 11 గంటల సమయంలో అంతా కలిసి గయాకు ఒక వాహనంలో బయల్దేరారు.
గయాకు వెళ్తున్న సమయంలో ఇంకో వాహనమేదో తమ వాహనాన్ని వెంబడించిందని, అందులోని వ్యక్తులే తమవాళ్లందరినీ చంపేశారని బృందంలో ఇప్పుడు మిగిలి ఉన్న లోవరాజు అనే యువకుడు తెలిపాడు. వారణాసి ప్రభుత్వాస్పత్రిలో తనకు చికిత్స అందిస్తున్న వైద్యుడి సెల్ ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించాడతను. విషయం తెలియగానే ఆందోళనపడ్డ బంధువులు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అరుణ్కుమార్ను ఆశ్రయించారు. తక్షణం స్పందించిన కలెక్గర్ చికిత్స కాశీలో లోవరాజుకు చికిత్స అందిస్తున్న వైద్యులతో ఫోన్ లో మాట్లాడారు.
కాగా.. తలకు తీవ్రమైన గాయంతో చికిత్స పొందుతున్న లోవరాజు.. తన కళ్లముందే దుండగులు అందరిని హత్య చేశారని చెబుతున్నాడు. లోవరాజు సమాచారం ఇచ్చిన తర్వాత బృందంలోని మిగిలినవాళ్ల ఫోన్లకు ప్రయత్నించగా కొన్ని ఫోన్లు ఇప్పటికీ రింగవుతూనే ఉన్నాయి, మరికొందరి ఫోన్లు మాత్రం స్విచాఫ్ అయిపోయాయి. బృందంలోని వ్యక్తుల్లో లోవరాజు నాయనమ్మ, తాతయ్య కూడా ఉన్నారు.
ఇదంతా ఇలా ఉంటే.. మిస్టరీగా మారిపోయిన ఈ యాత్రకు సంబంధించి లోవరాజు చెప్పిన విషయాలను కొట్టిపారేస్తున్నారు గొల్లపేట గ్రామస్తులు. తలకు గాయం కావడంతో మతి భ్రమించి ఇలా మాట్లాడుతున్నాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లోవరాజును వారాణాసి ప్రభుత్వాసుపత్రిలో ఎవరు చేర్చారనేది కూడా ఇంతవరకు తెలియరాలేదు.