తాళి బొట్లతో సభలోకి టీడీపీ సభ్యులు - లాగేసిన వైసీపీ ఎమ్మెల్సీ : సభ్యుల సస్పెన్షన్..!!
శాసనసభలో..శాసన మండలిలో టీడీపీ నిరసనలు కొనసాగుతున్నాయి. దాదాపు పది రోజులుగా జంగారెడ్డి గూడెంలో మరణాలు కల్తీ మద్యం కారణంగా చోటు చేసుకున్న మరణాలని టీడీపీ ఆరోపిస్తోంది. కావాని ప్రభుత్వం వాదిస్తోంది. దీని పైన శాసనసభలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులు ఆందోళన చేస్తూ పోడియాన్ని చుట్టముట్టారు. సభలో విజిల్స్ వేయటం..చిడదలు వాయించటం వంటి వాటి ద్వారా నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో..వారి పైన స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేయటం.. సస్పెండ్ చేయటం చోటు చేసుకుంటున్నాయి.
ఇక, ఈ రోజు సమావేశాలకు చివరి రోజు కావటంతో టీడీపీ తమ ఆందోళన తీవ్ర తరం చేసింది . ఉదయం సమావేశాల ప్రారంభానికి ముందు టీడీపీ ఎమ్మెల్సీలు - ఎమ్మెల్యేలు మద్య నిషేధంపై మహిళలకు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ గోవిందా గోవిందా..అంటూ తాళిబొట్లు చేతపట్టుకుని నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుల ఫోటోలకు నివాళులర్పిస్తూ నల్ల కండువాలతో టీడీపీ నేతలు ప్రదర్శన నిర్వహించారు. ఇక, మండలిలో టీడీపీ నేతలు సభలోపల సైతం తాళి బొట్లతో ఛైర్మన్ పోడియం వద్ద ఆందోళన నిర్వహించారు. తాళిబొట్లను ప్రదర్శించటం ద్వారా మహిళలను టీడీపీ సభ్యులు కించపరిచేలా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ మహిళా సభ్యులు మండిపడ్డారు.
టీడీపీ సభ్యుల తీరు పైన ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. వారి నుంచి తాళిబొట్లను లాగేసుందుకు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రయత్నం చేసారు. దీంతో..సభలో గందరగోళం చోటు చేసుకుంది. అదే సమయంలో ఛైర్మన్ వారించినా టీడీపీ సభ్యులు ఆందోళన వీడకపోవటంతో ఛైర్మన్ ఎనిమిది మంది టీడీపీ సభ్యులు సస్పెండ్ చేసారు. దీనికి నిరసనగా మిగిలిన టీడీపీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. అటు శాసనసభలోనూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పోడియం పైన శబ్దాలు చేస్తూ..నినదాలు చేయటంతో స్పీకర్ వారి పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు ద్రవ్య వినిమియ బిల్లు ఆమోదంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి.