షాకింగ్: 'జగన్ పార్టీలో బిట్ కాయిన్ మోసగాడు, తమిళనాడులో కీలక నేత'
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీ అసాంఘిక శక్తుల అడ్డాగా మారిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో టిడిపి కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ పైన 11 ఛార్జీషీట్లు ఉన్నాయని విమర్శించారు. లక్ష కోట్లు దోచుకొని ప్రతి శుక్రవారం కోర్టు మెట్లు ఎక్కుతున్నారని చెప్పారు.
వారిపైనా ఆరోపణలు
వైయస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు కూడా కేసులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పాదయాత్రలో పాల్గొంటున్న రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి, ధర్మా ప్రసాద రావు, మోపిదేవి వెంకటరమణల పైన ఆరోపణలు ఉన్నాయని చెప్పారు.
బిట్ కాయిన్ మోసం రామకృష్మా రెడ్డి వైసీపీలో ఉన్నారు
ఇటీవల బిట్ కాయిన్ ఇండియా సాఫ్టువేర్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీని నెలకొల్పి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి మోసం చేసిన సైకం రామకృష్ణా రెడ్డి వైసీపీలో ఉన్నారని వర్ల రామయ్య విమర్శించారు.
సైకం వైసీపీలో ఉంటూ తమిళనాడు పార్టీ ముఖ్య నేత
సైకం రామకృష్ణా రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తమిళనాడులో ఆ పార్టీకి ముఖ్య వ్యక్తిగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా రామకృష్ణా రెడ్డికి ఒక సభలో జగన్ గురించి మాట్లాడుతున్న వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు.
విభజన హామీలపై ప్రధానిని కలిసి విజ్ఞప్తి
ఇదిలా ఉండగా విభజన హామీలపై ప్రధాని మోడీని కలిసి నివేదించాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. బుధవారం మధ్యాహ్నం సుజనా చౌదరి నివాసంలో జరిగిన సమావేసంలో ఈ మేరకు తీర్మానం చేశారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు, రెవెన్యూ లోటు భర్తీ, పెండింగులో ఉన్న విశ్వవిద్యాలయ ఏర్పాటు, ప్రత్యేక ప్యాకేజీ కింద హోదాకు సమానమైన విదేశీ రుణం మంజూరు అంశాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లనున్నారు.