వైసీపీ వాళ్లు రోడ్డెక్కుతున్నారు.. మీ ఇళ్లు జాగ్రత్త..! : వర్ల సెటైర్స్
విజయవాడ : 100 ప్రశ్నలతో అధికార పార్టీ పనితీరును జనంలోకి వెళ్లి ప్రశ్నించడానికి వైసీపీ సిద్దమవుతుండడంతో.. అధికార టీడీపీ నేతలు వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతున్నారు. శుక్రవారం నాడు 'గడగడపకూ వైసీపీ' కార్యక్రమం మొదలవుతుండడంతో జనంలోకి వెళ్లకముందే వైసీపీ తీరును ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు.
వైసీపీ కొత్త కార్యక్రమంపై బుధవారం నాడు స్పందించిన టీడీపీ సీనియర్ నేత, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య పదునైన విమర్శలతో ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, 'గడగడపకూ వైసీపీ' కార్యక్రమం నేపథ్యంలో 'వైసీపీ వాళ్లు వస్తున్నారు.. మీ ఇళ్లు జాగ్రత్త..!' అంటూ వైసీపీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు.
ఇదే విషయంపై మరింత ఘాటుగా స్పందిస్తూ.. '11 కేసుల్లో నిందితులుగా ఉన్నవాళ్లంతా రోడ్లకు మీదకు రాబోతున్నారు, కాబట్టి ప్రజలంతా తమ ఇళ్లను జాగ్రత్తగా చూసుకోవాలి..!' అంటూ వైసీపీపై సెటైర్లు వేశారు వర్ల. ఇకపోతే వైసీపీని ఓ చచ్చిపోయిన పార్టీగా అభివర్ణించారాయన.
వైసీపీ అధినేత జగన్ పై ధ్వజమెత్తుతూ.. జగన్మోహన్ రెడ్డికి ఇంకా దింపుడు కళ్లం ఆశలు పోలేదని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీపై 100 ప్రశ్నలు సంధిస్తూ జనంలోకి వెళ్లబోతున్న వైసీపీ తీరును తప్పుబడుతూ ఏపీ ప్రజలంతా సీఎం చంద్రబాబునాయుడికి నూటికి నూరు మార్కులు ఎప్పుడో వేశారన్నారు.
టీడీపీ పైనే ప్రశ్నలు సంధించడాన్ని ప్రస్తావిస్తూ.. విపక్ష నేతగా ప్రజలు జగన్ కు ఎన్ని మార్కులు వేస్తారో కూడా తెలుసుకోవాలని, ఇందుకోసం కరపత్రాల్లో విపక్ష జగన్ పనితీరుకు సంబంధించిన ఆప్షన్ ను కూడా చేర్చాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ తన డిమాండ్ కు సానుకూలంగా వైసీపీ కరపత్రంలో జగన్ ఆప్షన్ ను చేర్చినా.. ప్రజలు ఆయనకు సున్నా మార్కులు వేయడం ఖాయమన్నారు. అలా జరగని పక్షంలో తన చెవి కోసుకోవడానికైనా సిద్దమేనని ప్రకటించారు వర్ల.