మా పార్టీ మూతపడదు: జగన్ ఆస్తుల కేసుపై పద్మ ట్విస్ట్, కొత్త డిమాండ్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం నాడు అన్నారు. తమ పార్టీ మూతపడుతుందని వస్తున్న వార్తల పైన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈడీ కేసుల నుంచి జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ఆస్తులను ఈడీ అటాచ్ చేయడాన్ని సాకుగా చూపి టిడిపి నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి నుంచి దృష్టి మరల్చేందుకు వారు జగన్ పైన విషప్రచారం చేస్తున్నారన్నారు.
బాబు అవినీతిపై చర్చకు డిమాండ్
ఈడీ జగన్ ఆస్తులను అటాచ్ చేసిందని, జఫ్తు చేయలేదని ఆమె ట్విస్ట్ ఇచ్చారు. ఈడీ న్యాయనిర్ధారణ సంస్థ కాదని, అది పోలీస్ లాంటి వ్యవస్థ అని, సీబీఐ ఆరోపణల ఆధారంగా ఈడీ అటాచ్ చేసిందని చెప్పారు. అసలు ఇప్పుడు చంద్రబాబు అవినీతి పైన చర్చ జరగాలని డిమాండ్ చేశారు.
ఈడీ అటాచ్ను సాకుగా తీసుకొని టిడిపి నేతలు దుష్ప్రచారం వెంటనే మానుకోవాలని హితవు పలికారు. జగన్ కేసు పైన విచారణ జరుగుతోందని, ఇంకా తీర్పు రావాల్సి ఉందన్నారు. ఆస్తులు అటాచ్ చేసినంత మాత్రాన స్వాధీనం చేసుకున్నట్లుగా చెప్పడం సరికాదన్నారు.

జగన్ అప్పుడు ఓ వ్యాపారి
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు వైయస్ జగన్ ఒక వ్యాపారవేత్త మాత్రే అన్నారు. వైయస్ చనిపోయాక ఓదార్పు యాత్రతో ప్రజాభిమానం సంపాదించుకున్నారని, దీంతో కాంగ్రెస్, టిడిపిలు భయపడ్డాయన్నారు. అందుకే ఆయన పైన తప్పుడు కేసులు వేశాయన్నారు.
జగన్ ఆస్తులు తిరిగి ఆయనకే ఎప్పటికైనా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎప్పటికైనా న్యాయానిదే తుది విజయం అన్నారు. టిడిపి నాయకులకు ముందు ముసళ్ల పండగ ఉందని హెచ్చరించారు. జగన్ను ప్రజల నుంచి దూరం చేసేందుకు టిడిపి కుట్ర చేస్తోందన్నారు.
విచారణ పూర్తికాకుండానే అటాచ్ను ఓ భూతంలా చూపిస్తున్నారన్నారు. ఓటుకు నోటులో చంద్రబాబు దొరికిపోయారని ఆరోపించారు. చంద్రబాబు అవినితిపై తాము ఓ పుస్తకాన్ని ముద్రించామని, ఆయన నిజాయితీపరుడైతే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారన్నారు. చంద్రబాబు తీరు దొంగే దొంగ అన్నట్లుగా ఉందన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడుతుందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ గురువారం నాడు అన్నారు. తమ పార్టీ మూతపడుతుందని వస్తున్న వార్తల పైన ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కేసుల నుంచి జగన్ నిర్దోషిగా బయటకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications