దేశం సర్వనాశనం, దొంగ చేతికా: బాబుకు మోడీ 'బాధ్యతల'పై వాసిరెడ్డి తీవ్రవ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బాధ్యతలు అప్పగిస్తే దేశం సర్వనాశనం అవడం కాయమని వైసిపి నేత వాసిరెడ్డి పద్మ మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బాధ్యతలు అప్పగిస్తే దేశం సర్వనాశనం అవడం కాయమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మంగళవారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై అధ్యయనం చేసేందుకు చంద్రబాబు సారథ్యంలో కేంద్రం ఓ సబ్ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మొత్తం ఆరు రాష్ట్రాల సీఎంలతో కూడిన సబ్ కమిటీని మంగళవారం నాడు కేంద్రం ఏర్పాటు చేసింది.
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పుదుచ్చేరి సీఎం నారాయణ, త్రిపుర మాణిక్ సర్కార్, బీహార్ సీఎం నితీష్ కుమార్ లను కమిటీలో సభ్యులుగా నియమించింది కేంద్రం. ఈ ఆరుగురు సభ్యుల కమిటీకి ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యం వహిస్తారు.
ఈ నేపథ్యంలో వాసిరెడ్డి పద్మ స్పందించారు. బ్లాక్ మనీతో ఎమ్మెల్సీలను కొనుగోలు చేసిన చంద్రబాబుకు ఉపసంఘం సారథ్య బాధ్యతలను అప్పగించడం ఏమిటని ప్రశ్నించారు. ఉపసంఘంకు చంద్రబాబును చైర్మన్గా నియమించడం అంటే దొంగ చేతికి తాలాలు ఇచ్చినట్లే అన్నారు.
చంద్రబాబు ఓటుకు నోటు కేసులో ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయాడన్నారు. విదేశాలలోని నల్ల డబ్బు గురించి కేంద్రానికి ఏమాత్రం పట్టదా అని నిలదీసారు. సామాన్యుల తరఫున చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదన్నారు.
నోట్ల రద్దు: ఏపీ ఉద్యోగులకు చేదు, తెలంగాణ ఉద్యోగులకు 'ఆర్బీఐ' శుభవార్త
కనీసం ప్రజల కష్టాలను ప్రధాని మోడీ దృష్టికి తీసుకు వెళ్లడం లేదన్నారు. అడగాల్సిన చోట అడగకుండా తప్పునంతటినీ చంద్రబాబు.. బ్యాంకర్ల పైకి నెడుతున్నారన్నారు.
అనేక కేసుల్లో విచారణ జరగాల్సిన చంద్రబాబు.. సీఎంల కమిటీకి ఎలా సారథ్యం వహిస్తారని ప్రశ్నించారు. మరో నాలుగు రాష్ట్రాలకు చంద్రబాబు నేర సామ్రాజ్యం విస్తరించేందుకే ఈ బాధ్యతలు అప్పగించారా అన్నారు. చంద్రబాబుకు బాధ్యతలు అప్పగిస్తే దేశం సర్వనాశనం అన్నారు.