రిషికేశ్వరి కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ప్రిన్సిపల్ డిస్మిస్, వీసీ బదలీ
న్యూఢిల్లీ: రిషికేశ్వరి ఆత్మహత్య కేసును విచారించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారం నాడు తెలిపారు. కమిటీ సిఫార్సుల మేరకు ప్రత్యేకంగా ప్రభుత్వ న్యాయవాదిని నియమిస్తామన్నారు.
కేసు విచారణ వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల పైన బాలసుబ్రహ్మణ్యం కమిటీ సమగ్ర నివేదిక ఇచ్చిందని చెప్పారు. సభ్యత, నైతిక విలువలు, మానవత్వం మరిచిపోయి పరిమితులు దాటి నిందితులు ర్యాగింగ్కు పాల్పడటమే ఆమె మరణానికి కారణమని కమిటీ తేల్చిందన్నారు.
ర్యాగింగ్ కారణంగా మానసికంగా తీవ్ర ఆవేదన అనుభవించి అవమాన భారంతో జీవితంపై విరక్తి చెంది రిషికేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్నారు. ఈ నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపల్గా వ్యవహరించిన బాబురావును తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఆయన అండదండలు, నిర్లక్ష్యం ఉండబట్టే ర్యాగింగ్ జరిగినట్లు కమిటీ విచారణలో తేలిందన్నారు. ఆయనను పోలీసులు విచారించనున్నారని, వారు కూడా ఆయన నిర్లక్ష్యాన్ని తేల్చితే ఆ కేసులో నిందితుడిగా కూడా మారుతారన్నారు. నాగార్జున ఇంఛార్జి ఉప కులపతిగా వ్యవహరిస్తున్న సాంబశివ రావును తప్పించి ఆ బాధ్యతలను కళాశాల విద్య, సాంకేతిక విద్య కమిషనర్ ఉదయ లక్ష్మికి అప్పగించినట్లు చెప్పారు.
బాబురావు పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. రిషికేశ్వరి ఘటనకు కారణమైన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని గంటా శ్రీనివాస రావు స్పష్టం చేశారు.
మా అమ్మాయి ఆత్మహత్యకు ప్రిన్సిపాలే కారణం: రిషితేశ్వరి తండ్రి
తన కూతురు రిషికేశ్వరి ఆత్మహత్యకు ప్రిన్సిపల్ బాబురావే కారణమని ఆమె తండ్రి మురళీకృష్ణ ఆదివారం ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై యూనివర్శిటీలో మరే అమ్మాయికి ఇలా జరగకూడదన్నారు.
అప్పుడే తన కుమార్తె జీవించినట్టు భావిస్తానని చెప్పారు. తన కూతురిపై జరిగిన లైంగిక వేధింపులకు బాబూరావు పూర్తి స్థాయి సహకారాన్ని అందించారన్నారు. ఈ నేరం చేసిన ప్రిన్సిపాల్ కు శిక్ష పడాల్సిందే అంటూ కంట తడి పెట్టారు.