అందుకే జగన్ వెంట వెళ్లా, ఆ విషయం చెప్పేశా: టిడిపిలో చేరిన వేదవ్యాస్
అమరావతి: కృష్ణా జిల్లా సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన సైకిల్ ఎక్కారు. ఈ సందర్భంగా వేదవ్యాస్ మాట్లాడారు.
తాను 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు. ఆ పార్టీ నుంచి పోటీ చేయవలసి వచ్చిందని అన్నారు. పట్టిసీమ వంటి ప్రాజెక్టును అడ్డుకోవద్దని తాను వైసిపిలో ఉన్నప్పుడు అదే పార్టీ వేదికల పైన బహిరంగంగా చెప్పానని గుర్తు చేశారు.
విభజన అనంతరం ఏపీ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుందని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రాన్ని, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేయడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే సాధ్యమని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా రైతులకు రూ.24వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత తమదేనన్నారు.
ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం ప్రతిపక్షాలకు అలవాటయిపోయిందని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. అమరావతి నిర్మాణంపై రోడ్డెక్కారని, భోగాపురం విమానాశ్రయంపై దుష్ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.