సెంట్రల్ వద్దు: సీటు మార్పుపై వెల్లంపల్లి శ్రీనివాస్ అసంతృప్తి..?!
Vellampalli Srinivas: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతోంది. ఇందులో భాగంగా అభ్యర్థుల మలి విడత ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తాజాగా మూడు లోక్సభ, 24 అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించింది. 11 మందితో ఇదివరకే తొలి జాబితా విడుదలైన విషయం తెలిసిందే.
ఇందులో సామాజిక సాధికారత కల్పించారు వైఎస్ జగన్. మహిళలు, యువతకు పెద్ద పీట వేశారు. చోట్ల కొత్తవారికి అవకాశం ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన ప్రాధాన్యతను కల్పించారు. సామాజిక సాధికారతే ఆయుధంగా ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. మలి జాబితాలో అన్ని కులాల వారికీ ప్రాతినిధ్యం కల్పించడం విశేషం.

ఈ మార్పులు- చేర్పుల సందర్భంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్కు స్థాన చలనం కలిగింది. ప్రస్తుతం ఆయన విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు ఆయన అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2009లో ప్రజారాజ్యం తరఫున, 2019లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. 2014లో బీజేపీ అభ్యర్థిగా ఓటమి చవి చూశారు.
ఈ సారి కూడా విజయవాడ వెస్ట్ నుంచే పోటీ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో- ఆయనకు స్థానచలనం కల్పించింది వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వం. విజయవాడ సెంట్రల్కు పంపించింది. మల్లాది విష్ణు సొంత నియోజకవర్గం ఇది. ఆయనను తప్పించి- వెల్లంపల్లికి టికెట్ ఇచ్చింది.
ఈ పరిణామం వెల్లంపల్లిలో అసంతృప్తికి దారి తీసినట్లు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తే ప్రతికూల ఫలితాలు రావొచ్చనే ఆందోళనలో ఆయన ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో- తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జగన్ను కలిస్తారని, సీటు మార్చాలని విజ్ఞప్తి చేస్తారని సమాచారం. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియరావట్లేదు.












Click it and Unblock the Notifications