నేను లోకేశ్ బినామీ కాదు.. నిరూపిస్తే మొత్తం ఇచ్చేస్తా.. వేమూరి రవి చాలెంజ్
మాజీ మంత్రి నారా లోకేశ్ కు తాను బినామీ కాదని, రాజధాని ప్రాంతంలో కొన్న భూములన్నీ సక్రమమైనవేనని ఏపీ ఎన్ఆర్టీ మాజీ చైర్మన్ వేమూరి రవికుమార్ చెప్పారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ పై కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించిన రిపోర్టులో వేమూరి రవి పేరు ప్రముఖంగా వినపపడటం, అక్రమంగా వందల ఎకరాలు కొనుగోలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన శనివారం మీడియా ముందుకొచ్చారు. తాను ఎన్నారైనని, రాష్ట్రానికి మంచి చెయ్యాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వంతో కలిసి పనిచేశానని, అంతమాత్రానికే బినామీ ముద్రవేయడం సరికాదని రవి వాపోయారు.
ఆ 19 మంది జగన్ బినామీలా?
‘‘నేను అమెరికాలో 25ఏండ్లు పనిచేసిన తర్వాత 2012లో ఆంధ్రప్రదేశ్(ఉమ్మడిరాష్ట్రం)కు వచ్చేశాను. ఇతరులకు బినామీగా వ్యవహరించాల్సిన అవసరంగానీ.. వేరేవాళ్లను బినామీలుగా పెట్టుకునేంత ధైర్యంగానీ నాకు లేవు. అసలు నన్ను బినామీగా ఎలా గుర్తించారో అర్థంకావడంలేదు. ప్రభుత్వానికి కన్సల్టెంట్ గా పనిచేసినంత మాత్రాన బినామిలైపోతారా? ఆ లెక్కన జగన్ సర్కారు నియమించిన 19 మంది కన్సల్టెంట్లు కూడా ఆయనకు బనామీలేనా? వైజాగ్, కర్నూలులో కూడా నేను భూములుకొన్నాను.. అలాగని జగన్ బినామీ అవుతానా? దీనిపై ప్రభుత్వమే క్లారిటీ ఇవ్వాలి''అని వేమూరి రవి ప్రశ్నించారు.
భూములు కొన్నమాట నిజమే..
తాను గుంటూరు జిల్లా వాసినన్న వేమూరి.. 2005లోనే సొంతగా ఆరు ఎకరాలు కొన్నానని, రాజధాని ప్రకటన తర్వాత తెల్సినవాళ్లతో భూములు కొనిపించానని, 2015 తర్వాత కొన్న భూములను కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ గా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. ఎన్నారైలు సహజంగానే బ్లాక్ మనీకి, అక్రమ వ్యవహారాలకు దూరంగా ఉంటారని, తాము కొన్న భూములన్నీ సక్రమమేనవేనని, అప్పటి ధరల ప్రకారమే డబ్బులిచ్చి, స్టాంప్ డ్యూటీ కూడా చెల్లించామని రవి వివరించారు.
ప్రభుత్వానికిదే నా చాలెంజ్..
ఇన్ సైడర్ ట్రేడింగ్ ద్వారా ఒక్క ఇంచు భూమి కొన్నట్లు నిరూపించినా.. తనకున్న మొత్తం భూమిని ప్రభుత్వమే తీసుకోవచ్చని వేమూరి రవి చాలెంజ్ విసిరారు. ‘‘ఇప్పుడెలాగో ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవుకదా.. నా భూములతోనైనా కొరత తీరుతుందేమో. సీబీఐ, ఎఫ్ బీఐ, సీఐఏ.. లాంటి అన్ని సంస్థలతో ఎంక్వైరీ చేసుకోవచ్చు. అసెంబ్లీలో కూడా నన్ను లోకేశ్ బినామీగా ప్రస్తావించడం ప్రభుత్వానికి సిగ్గుచేటు. ప్రూఫ్ ఉంటే నేను చేసిన తప్పుల్ని నిరూపించండి..''అని వేమూరి రవి అన్నారు.