చంద్రబాబు ఆశలపై నీళ్లు: గడువు చెప్పలేమన్న వెంకయ్య
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పటి వరకు పెరుగుతుందనే విషయాన్ని కేంద్ర మంత్రిఎం. వెంకయ్య నాయుడు తేల్చలేమని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిచంద్రబాబు నాయుడి ఆశలపై నీళ
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పటి వరకు పెరుగుతుందనే విషయాన్ని కేంద్ర మంత్రి, బిజెపి నేత ఎం. వెంకయ్య నాయుడు తేల్చలేమని చెప్పారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు ఎప్పటిలోగా పెరుగుతాయనేది చెప్పలేనని వెంకయ్యనాయుడు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు పెంచవలసి ఉన్నదని, ఈ మేరకు విభజన చట్టంలో హామీ ఇచ్చారని ఆయన అన్నారు
శాసన సభల సీట్లు పెంచటం గురించి ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చలు జరిపానని, ఇటీవల న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, అధికారులతో కూడా చర్చలు జరిపినట్లు వెంకయ్యనాయుడు వివరించారు.
నేను కూడా ఆశిస్తున్నా...
శాసన సభల సీట్లు పెరగాలని తాను కూడా ఆశిస్తున్నానని, ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయని వెంకయ్య నాయుడు చెప్పారు. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల సీట్లు ఎప్పటిలోగా పెరుగుతాయనేది చెప్పలేనని, అది తన చేతుల్లో లేదని ఆయన అన్నారు.
Recommended Video
సీట్లు పెరుగుతాయని....
అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని, అందువల్ల తాను ఆశించినవారందరికీ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వగలుగుతానని చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను పార్టీలోకి తీసుకున్న సమయంలో మొదట నుంచీ పార్టీలో ఉన్నవారు వ్యతిరేకించినప్పుడు ఆయన ఆ హామీ ఇస్తూ వచ్చారు. అయితే, చంద్రబాబు ఆశించినట్లు వచ్చే ఎన్నికల్లోగా అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో అసమ్మతికి గురయ్యే నాయకులు వేరు దారులు చూసుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.
అది అన్యాయం...
అమర్నాథ్ యాత్రపై దాడి జరగటం అన్యాయమని, దీనిని దేశం యావత్తు తీవ్రంగా ఖండిస్తోందని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ దాడుల వెనక పాకిస్తాన్ ఉందనేది అందరికీ తెలుసునని అన్నారు. రాజకీయ పార్టీలన్నీ ఈ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని, భద్రతా దళాలకు అండగా నిలబడాలని సూచించారు. దేశం నలుమూలల నుండి అమర్నాథ్ యాత్రకు వస్తున్నారంటూ, దీనిపై దాడి జరగటం వలన కాశ్మీర్కు చెడ్డపేరు వస్తోందని ఆయన అన్నారు.
పాక్ తీవ్రవాదంపై...
పాక్ తీవ్రవాదాన్ని ప్రధాని మోదీ ప్రపంచ దేశాల దృష్టికి తీసుకురావటంతోపాటు ఇటీవల జరిగిన జి-20 శిఖరాగ్ర సమావేశంలో అందరి దృష్టికి తెచ్చారని వెంకయ్య నాయుడు చెప్పారు. ఉగ్రవాదులు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు చేస్తుంటే పశ్చిమ దేశాలు పట్టించుకోలేదని, ఇప్పుడు ఉగ్రవాదులు అక్కడ కూడా దాడులు చేయటంతో సమస్య తీవ్రతను వారు గుర్తిస్తున్నారని అన్నారు.
తెలుగు యాత్రికులు ఇలా చేయాలి...
అమర్నాథ్ యాత్రకు వెళ్లే తెలుగు యాత్రికులు మొదట రిజిస్టరు చేసుకోవాలని, భద్రతా దళాల పర్యవేక్షణలోనే అమర్నాథ్ యాత్రకు వెళ్లాలని వెంకయ్య నాయుడు సూచించారు. యాత్రకు వెళ్లాలనుకునేవారు ధైర్యంగా వెళ్లవచ్చునని, అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.