మమ్మీ.. డాడీ.. బీడీ వద్దు, అమ్మ, నాన్న, అక్క, బావ ముద్దు! : వెంకయ్య
తూర్పుగోదావరి : ఇంగ్లీష్ నేర్చుకోవడం వరకు ఓకె గానీ బ్రిటీష్ వారి మనస్తత్వాన్నే అలవరుచుకోవద్దని సూచించారు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. మమ్మీ.. డాడీ.. బీడీ అని కాకుండా..అమ్మ, నాన్న, అక్క, బావ అని మాతృభాషలో చక్కగా సంబోధించాలని చెప్పారు.బోధన ఆంగ్లమయినా వ్యక్తిత్వ భావనల్లో భారతీయత స్పష్టమవాలన్నారు.
తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన సన్మానం కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు వెంకయ్య. చాలా మంది మన భాష మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. మన అలవాట్లన్నీ భారతీయతను వ్యక్తీకరించేలా ఉండాలన్నారు. ప్రపంచమంతా భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటుందని, మన యాస గోస భాష కట్టు బాట్లలో ఎంతో గొప్పదనం దాగుందని తెలిపారు.
దేశంలో అజ్ఞానాన్ని పూర్తిగా రూపుమాపాలని, ఇందుకోసం దేశ యువత అంతా సక్రమ మార్గంలో నడుచుకోవాలని, అప్పుడే నిజమైన దేశాభివృద్ధి జరుగుతుందని వెంకయ్య చెప్పుకొచ్చారు. ఇదే వేదికపై అబ్దుల్ కలాం గురించి, నరేంద్రమోడీ గురించి కొనియాడారు. 'పేపర్ బాయ్ అబ్దుల్ కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు... నరేంద్ర మోదీ టీ అమ్మారు ఇప్పుడు మహానాయకుడు కాగలిగారు' అంటూ ప్రశంసించారు.
ఏ దేశంలో అడుగుపెట్టినా.. యువత మోడీ నామస్మరణ చేస్తున్నారని, మోడీని, కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారత మాతాకీ జై అంటే దేశంలో ఉన్న ప్రజలందరికీ జయము కలుగుగాకా అని అర్థం' అని వెంకయ్య వివరించారు.మతం, కులం వ్యక్తిగతమైన అంశాలని వాటి విషయంలో గొడవలు సరికాదని తెలియజేశారు.