నాకెవరు చేయాల్సిన అవసరంలేదు: తెలుగువారికి వెంకయ్య, 'ఈ సమంత' కాదంటూ...
అమరావతి: తాను ఎన్నికల్లో నిలబడనని, తన పిల్లలు కూడా పోటీ చేయరని, తనకు ఎవరూ ఏం చేయవలసిన అవసరం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శుక్రవారం అన్నారు. ప్రత్యేక హోదా పైన తాను యూ టర్న్ తీసుకున్నానని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతిలో పరిపాలనా నగరం శంకుస్థాపన సందర్భంగా వెంకయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విభజన సమయంలో రాజ్యసభలో ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని వెంకయ్య నాయుడు పోట్లాడారని, ఇప్పుడు మిన్నకుంటున్నారని పలువురు విమర్శిస్తున్నారని వైసిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి అన్నారు.
అవును తాను నిజంగానే పోరాడానని చెప్పారు. తన వల్లే ఎన్నో హామీలు వచ్చాయన్నారు. నేను రాజ్యసభలో మాట్లాడబట్టే.. మిగతా వారు నోరు మూసుకొని ఉన్న వేళ, పెద్దపెద్ద వారి నోళ్లు పడిపోయిన వేళ మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్నారు.
నేనేం ఎన్నికల్లో నిలబడనని, నా పిల్లలు కూడా నిలబడరని, కానీ తెలుగువాడిగా ఏపీకి న్యాయం కోసం కృషి చేస్తున్నానని చెప్పారు. అరుణ్ జైట్లీ కూడా విభజన సమయంలో ఏపీ కోసం ఎంతో చేశారని చెప్పారు.
మోడీ ప్రధాని కాదని, ఓ బ్రాండ్ అన్నారు. అమెరికా అధ్యక్షులు ప్రధాని నరేంద్ర మోడీని పొగిడారన్నారు. మోడీని సమంత కూడా పొగిడారని వెంకయ్య అన్నారు. అంతలోనే.. సమంత అంటే ఈ సమంత కాదని, బ్రిటన్ సమంత అని చెప్పారు.
చంద్రబాబుకు ప్రశంసల గురించి మాట్లాడుతూ..
చంద్రబాబును పొగిడారని అంటున్నారని, మంచి వాళ్లను పోగిడే వారిని అభినందిస్తే ఇంకా మంచి చేస్తారని, ఆందరికీ ఆదర్శపాయంగా ఉంటారని, ఆయన పని చూసి అభినందిస్తున్నానని వెంకయ్య చెప్పారు. చంద్రబాబుకు పనే ఓ పని అన్నారు. రాజధాని రాత్రికి రాత్రి ఏర్పడదని, అది అల్లావుద్దీన్ అద్భుత దీపం కాదన్నారు. అద్భుత నగరంగా తీర్చిదిద్దుతారని, కానీ అందరు చంద్రబాబుకు చేయూతనివ్వాలన్నారు.