'ప్రత్యేక' ఆందోళ వద్దు: వెంకయ్య, మాకు కూడా: టి స్టేట్
విశాఖపట్నం: ఆంద్రప్రదేశ్ రాజధాని, అభివృద్ధి, ప్రత్యేక హోదా వంటి అంశాలపై రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు శనివారం అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎపికి పదేళ్లు ప్రత్యేక హోదా కల్పించేలా చర్యలు చేపట్టామ్ననారు. ఈ విషయంలో ఎటువంటి అపోహలు అవసరం లేదన్నారు.
విభజనలో ఎపికి అన్యాయం జరిగిందని, రాష్ట్రానికి నూరు శాతం ప్రయోజనం చేకూరే విధంగా కృషి చేస్తామన్నారు. ప్రధాని మోడీ, ఎపి సిఎం చంద్రబాబుల ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
విశాఖను అంతర్జాతీయ వాణిజ్య నగరంగా మార్చుతామన్నారు. ఎపిలో రైల్వే జోన్ ఏర్పాటుకు కమిటీ వేశామని, పోలవరాన్ని తెలంగాణతో ముడి పెట్టి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. పోలవరానికి, తెలంగాణకు ఎటువంటి సంబంధం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. పోలవరం ఆంద్రుల జీవన రేఖ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని పైన వివాదాలకు తావులేకుండా పరిష్కరిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, పెట్రో కారిడార్, ఇతర పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి అవసరమైన నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం వేగంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు.
తెలంగాణ రాష్ట్రం డిమాడ్
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికీ ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ శనివారం ఆమోదించింది. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణలోని ఎనిమిది జిల్లాలు వెనుకబాటుకు చేరువగా ఉన్నాయని ప్రణాళికే సంఘమే నిర్ధారించిందన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు 85 శాతానికి పైగా ఉన్నారని, గిరిజనుల సంఖ్య 11 శాతం వరకు ఉందన్నారు. తెలంగాణ వెనుకబాటు, సామాజిక నేపథ్యం తదితర అంశాల ఆధారంగా తెలంగాణ రాష్ట్రం కూడా ప్రత్యేక ప్రతిపత్తి హోదాకు అర్హత కలిగి ఉందన్నారు. తెలంగాణకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించకుంటే తీవ్ర నష్టమని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.