పొలిటికల్ రీ ఎంట్రీపై తేల్చేసిన వెంకయ్య - ప్రధానికి రెండు సూచనలు..!!
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీ కాలం ముగిసింది. ఈ సమయంలో తన పొలిటికల్ రీ ఎంట్రీ పైన వెంకయ్య తేల్చి చెప్పేసారు. ఉప రాష్ట్రపతి హోదాలో చివరిసారిగా వెంకయ్య తన నివాసంలో ఇష్ఠాగోష్ఠి నిర్వహించారు. తన అనుభవాలను..మనసులో భావాలను పంచుకున్నారు. రాష్ట్రపతి పదవి గురించి ముందు నుంచీ తాను ఆలోచించలేదని వెంకయ్య స్పష్టం చేసారు. తాను రాష్ట్రపతి స్థానానికి వెళ్లలేకపోయాననే బాధ ఏ మాత్రం తేదని చెప్పారు.

ప్రోటోకాల్ ఆంక్షలు సరిపడవు
ఉప రాష్ట్రపతి పదవి కూడా తొలి నుంచీ ఇష్టం లేదని చెప్పుకొచ్చారు. ప్రోటోకాల్ ఆంక్షలు తనకు సరిపడవని వెంకయ్య పేర్కొన్నారు. తాను ఎప్పుడు ఏదీ కోరుకోకపోయినా.. తనకు ఆ దేవుడి దయతో పాటుగా పెద్దల అభిమానం వలన అన్నీ దక్కాయని వివరించారు. వాజ్పేయీ మంత్రివర్గంలో తనకు గ్రామీణాభివృద్ధిశాఖ కోరినప్పుడు వాజ్పేయీకి తనపై అభిమానం మరింత పెరిగిందని గుర్తు చేసుకున్నారు. ఇక, ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తరువాత పట్టణాభివృద్ధిశాఖ ఇచ్చారని..తాను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చానని, తనకు పట్టణాభివృద్ధి పైన ఏం తలుసని అడగ్గా.. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు పెరిగాయి.. మీకు ఇదే కరెక్టు అని ప్రధాని చెప్పిన విషయాన్ని వెంకయ్య గుర్తు చేసుకున్నారు.

ప్రధానికి సూచనలు చేయటంతో
ప్రధాని మోదీకి తాను రెండు సూచనలు చేశానని వెంకయ్య చెప్పుకొచ్చారు. ప్రధాని నిరంతరాయంగా 14 గంటల పాటు సీరియస్ గా పని చేస్తారని వివరించారు. తన సతీమణి ప్రధానికి రెండు సూచనలు చేయమని చెప్పారని..అందులో ఒకటి అప్పుడప్పుడూ నవ్వుతూ ఉండటం కాగా, రెండోది అవసరమైనంత నిద్ర పోవటం గా చెప్పారు. ఈ రెండు తాను ప్రధానికి చెప్పానని...ఆయన ఆ తరువాత పని చేసే సమయంలో నవ్వటం నేర్చుకున్నారని చెబుతూనే.. నిద్ర మాత్రం రాదని చెప్పేవారన్నారు. తాను తిరిగి రాజకీయాల్లోకి రానని స్పష్టం చేసారు. క్రియాశీలకంగా ఉండటం మాత్రం మానబోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజకీయాలు, పరిస్థితులపై అభిప్రాయాలను నిర్మొహమాటంగా వ్యక్తం చేస్తూనే ఉంటానని తేల్చి చెప్పారు.
Recommended Video


నిర్మొహమాటంగా స్పందిస్తా
జైఆంధ్ర ఉద్యమం, జేపీ ఉద్యమం, ఎమర్జెన్సీ జైలు జీవితం రాటుదేల్చాయని పాత రోజులను గుర్తు చేసుకున్నారు. రెండుసార్లు ఉదయగిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన తాను తర్వాత ఆత్మకూరు నుంచి బరిలో దిగినప్పుడు అతివిశ్వాసం దెబ్బ తీసిందని చెప్పారు. 1996 లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నుంచి గెలుస్తానని అనుకున్నానని.. మైనారిటీ ఓట్లు గంపగుత్తగా సలావుద్దీన్ ఒవైసీకి పడగా, మెజారిటీ ఓట్ల చీలికతో ఓటమి తప్పలేదని వివరించారు. ఎమర్జెన్సీ సమయంలో తాము విశాఖపట్నం జైలులో ఉన్నప్పుడు సంజయ్ గాంధీ సభను అనారోగ్యం సాకుతో జైలు నుంచి ఆసుపత్రికి వెళ్లిన తాను భగ్నం చేశానని గుర్తు చేసుకున్నారు. తనకు ఇక బీజేపీ సభ్యత్వం వద్దని.. పోస్టు ఏదిచ్చినా తాను తీసుకోనని స్పష్టం చేసారు. మళ్లీ పోస్ట్మ్యాన్ కాదలచుకోలేదని వెంకయ్య నాయుడు తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications