రాజయ్య కోడలు చనిపోయినప్పుడు ఎందుకు రాలేదు: రాహుల్కు వెంకయ్య సూటి ప్రశ్న
హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వాతావరణాన్ని రాహుల్ గాంధీ కలుషితం చేస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య మండిపడ్డారు. శనివారం ఉదయం కెనడా ప్రతినిధుల బృందం ఆయన్ని కలిసింది. ఈ సందర్భంగా మీడియాతో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రోహిత్ ఆత్మహత్య ఘటనపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు.
ఇదే సెంట్రల్ యూనివర్సిటీలో కాంగ్రెస్ హయాంలో 9 మంది విద్యార్ధులు ఆత్మహత్య చేసుకుంటే ప్రస్తుతం ఆందోళన చేస్తున్న నాయకులంటా ఎక్కడికి పోయారని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆత్మహత్యలపై రాహుల్ గాంధీ ముందుగానే స్పందించి ఉంటే రోహిత్ ఆత్మహత్య చేసుకునే వాడు కాదన్నారు.
వరంగల్లో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు చనిపోయినప్పుడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చి ఎందుకు పరామర్శించలేదని ఆయన ప్రశ్నించారు. రోహిత్ వేముల ఆత్మహత్యను విపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయి. ప్రస్తుతం కేరళలో ఘటనల పట్ల రాహుల్గాంధీ ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు.
స్మార్ట్ సిటీల జాబితాలో భువనేశ్వర్ ఎంపికపై హర్షం వ్యక్తం చేస్తూ కెనడా ప్రతినిధుల బృందం శనివారం కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిని కలిసింది. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీలు, ఇళ్ల నిర్మాణాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ప్రతినిధులు ఆసక్తి చూపించారని ఆయన చెప్పారు.
కెనడా బృందం భువనేశ్వర్కు సాంకేతిక సహకారం అందించింది. ఆకర్షణీయ నగరాల తొలి జాబితాలో భువనేశ్వర్ ఎంపిక కావడం పట్ల కెనడా బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఏపీ, తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు కెనడా ప్రతినిధులు ముందుకొచ్చారని వెంకయ్యనాయుడు వివరించారు.