తప్పంతా కాంగ్రెస్దే, అన్యాయం చేయం: ఏపీకి 'హోదా' లేదు, ప్యాకేజీపై వెంకయ్య వివరణ
అమరావతి: విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్ని తూచ తప్పకుండా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో తాము కట్టుబడి ఉన్నామని చెప్పిన వెంకయ్య, తమపై కాంగ్రెస్ పార్టీకి విమర్శలు చేసే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దూరదృష్టి లేకుండానే కాంగ్రెస్ రాష్ట్రాన్ని విభజించిందని ఆయన ఆరోపించారు.
ఏపీకి ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన నేపథ్యంలో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో గురువారం వెంకయ్య నాయుడు మీడియాతో మాట్లాడారు. ఐదేళ్లలో ఏపీ రెవన్యూలోటు భర్తీ చేస్తామని తెలిపారు. అటవీ, కొండ ప్రాంతం, వెనకబాటు ఆధారంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని 14వ ఆర్థిక సంఘం సూచించిందని అన్నారు.
విభజన తర్వాత ఏపీకి ఎన్నో ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయాలు, సంస్థలు కేటాయించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ వాడిన పదజాలం చాలా ఇబ్బందికరంగా ఉందని.. అందుకే హామీల అమలుకు సమయం పడుతోందన్నారు. తెలుగు రాష్ట్రాన్ని విభజించిన వారే ప్రధాని దిష్టిబొమ్మలు దహనం చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

హోదా కోసం తాను కూడా నిన్నటి వరకు పట్టుబట్టా
ఈ సంఘం సిఫార్సు వల్లే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేది లేకుండా పోయిందని వివరించారు. హోదా కోసం తాను కూడా నిన్నటి వరకు పట్టుబట్టానని ఆయన చెప్పారు. విస్తృత చర్చల తర్వాతే ప్రత్యేక హోదాపై ఓ నిర్ణయానికి వచ్చామని, దీనిపై తాను వ్యక్తిగత అభిప్రాయం చెప్పకూడదని ఆయన తెలిపారు. తెలుగు ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలని అన్నారు.

తెలుగు ప్రజలకు పోలవరం ప్రాజెక్టు జీవనధార
తెలుగు ప్రజలకు పోలవరం ప్రాజెక్టు జీవనధార అని అన్నారు. ఇందులో భాగంగానే కొత్త ప్రభుత్వం రాగానే బిల్లులో మొదటి కేబినెట్ భేటీలోనే తెలంగాణలోని ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టుకోసం ఏపీలో కలిపామని చెప్పారు. 34 ఏళ్లలో పూర్తికానీ ప్రాజెక్టు ఏడాదిన్నరలో ఎలా పూర్తవుతుందని, పోలవరానికయ్యే పూర్తి వ్యయం కేంద్రమే బరిస్తుందని, ఈ హామీకి చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. తమ చిత్తశుద్ధికి పోలవరం తార్కాణమని అన్నారు. జోన్ అంశాన్ని రైల్వే శాఖ అధ్యయనం చేస్తోందని తెలిపారు. రాష్ట్రానికి ఉన్న లోటును చర్చించిన తరువాత ఏపీపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రత్యేకంగా సాయం చేయాలని నిర్ణయించుకుందని అన్నారు.

ఏపీకి హోదా లేదు
కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు వంటి వాటిని మినహాయిస్తే పశ్చిమ బెంగాల్, ఒడిసా, ఏపీ ప్రాంతాలకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలని, ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికీ హోదా ఉండబోదని ఆర్థిక సంఘం చెప్పకనే చెప్పిందని ఈ సందర్భంగా వెంకయ్య గుర్తు చేశారు. ఏపీకి కేంద్రం అన్యాయం చేయబోదని స్పష్టం చేశారు.

ఏపీకి ప్రాజెక్టులు, పరిశ్రమలు రావడం ఇదే తొలిసారి
కేంద్రం ఏపీపై ప్రత్యేక దృష్టి పెట్టింది కాబట్టే ఇంత తక్కువ సమయంలో ఏపీకి ప్రాజెక్టులు, పరిశ్రమలు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. కేంద్రప్రభుత్వానికి వచ్చే నిధుల్లో 42 శాతం రాష్ట్రాలకు, 5 శాతం మున్సిపాలిటీలకు, 0.5 శాతం న్యాయవ్యవస్థకు పంపాలంటూ పలు అంశాలను సూచించిన ఆర్థిక సంఘం సిఫార్సులను ఆనాడే పార్లమెంట్ ఆమోదించిందని అన్నారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నందుకే ఈ వివరణ ఇస్తున్నానని చెప్పారు.












Click it and Unblock the Notifications