ఎవరున్నా ఆ శక్తి: హైదరాబాద్పై తెరాసకు వెంకయ్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ప్రపంచ దృష్టిని ఆకర్షించే శక్తి హైదరాబాదుకు ఉందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఆదివారం అన్నారు. హైదరాబాదులో ఎవరైనా నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టవచ్చునని తెలిపారు.
హైదరాబాద్లో నివసిస్తున్న వారందరూ హైదరాబాదీలేనన్నారు. హైదరాబాద్ ఉప్పల్లో కంపెనీ సెక్రటరీల భవన సముదాయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. హైదరాబాదులో ఆనందంగా ఎవరైనా పెట్టుబడులు పెట్టవచ్చునని తెలిపారు.
వారు వేరు వీరు వేరు అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదన్నారు. హైదరాబాద్లో ఉన్నవారందరికీ సమాన హక్కులుంటాయన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ అని, ప్రపంచంలోని నలుదిశల నుంచి ప్రజలను, పెట్టుబడులను ఆకర్షించే శక్తి హైదరాబాద్కు ఉందన్నారు.
అయితే, పాలించేవారు ఆ బ్రాండ్ను మసకబార్చకుండా ఉంటే చాలని ఆయన పరోక్షంగా తెరాస ప్రభుత్వానికి హితవు పలికారు. హైదరాబాద్ శక్తిని పెంచేలా మరిన్ని కార్యక్రమాలు చేయాలన్నారు. హైదరాబాదు శక్తిని పెంచేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అత్యుత్త ప్రతిభా పాఠవాలు ప్రదర్శించే సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. నరేంద్ర మోడీ వచ్చారని, ఏదైనా సాధించి తీరుతారన్న భరోసా ప్రజల్లో ఏర్పడిందన్నారు.
విద్వేషాలు రెచ్చగొట్టేవారిని ప్రజలు దూరంగా ఉంచాలని, విద్వేషాలు అభివృద్ధి ఆటంకమన్నారు. నినాదాలతో కాలం వెళ్లదీసే కాలం పోయిందన్నారు. చార్జీల పెంచడం ప్రభుత్వాలకు ఏమాత్రం సరదా కాదన్నారు. ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు సంక్షేమపథకాలు ప్రకటించడం మంచిది కాదని హితవు పలికారు.
ముందు ఫ్రీ పవర్ అంటారని ఆ తర్వాత లోపవర్ ఇస్తారని, చివరకు నో పవర్ అంటూ చేతులెత్తేస్తారని రాష్ట్ర ప్రభుత్వాలకు చురకలంటించారు. పన్నులు వేసి పనులు చేసి ప్రజా సంక్షేమానికి పాటుపడాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. తనకు ఆంధప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వేరువేరు కాదని, రెండు ఒకటేనన్నారు.