చరిత్రలో మోడీ-చంద్రబాబు పేర్లు, ఆ పని చేశాం: విభజనపై వెంకయ్య
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని కేంద్రమంత్రి వెంకయ్య సోమవారం అన్నారు.
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని కేంద్రమంత్రి వెంకయ్య సోమవారం అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన చెక్కును చంద్రబాబుకు ఢిల్లీలో అందజేశారు.
ఈ సందర్భంగా వెంకయ్య, మరో కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పడం చాలా సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయం, పరిశ్రమల అభివృద్ధి చేయడం మొదలైన అంశాలు తమ ప్రభుత్వ అజెండా అని, రైతు సంక్షేమం నిమిత్తం కిసాన్ బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, నిరంతర విద్యుత్ వంటి చర్యలు తీసుకున్నామన్నారు.
రూ.1,981 కోట్ల చెక్కు చంద్రబాబు చేతికి, 'సుజనా చౌదరి చొరవ'
1982లో పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని వెంకయ్య నాయుడు చెప్పారు. పోలవరం బహుళార్ధక సాధక ప్రాజెక్టు అన్నారు. ఈ ప్రాజెక్టు గురించి ఎప్పటి నుంచో కలలు కంటున్నామన్నారు. విభజన వల్ల ఏపీకి నష్టం జరిగిందన్నారు.
అందుకే తాను ఏపీకి న్యాయం జరగాలని పోలవరం ప్రాజెక్టుకు నిధులు, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏపీకి ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. యూపీఏ హామీ ఇచ్చినా ఆ విషయం మరిచిపోయిందన్నారు. విభజన సమయంలో అరుణ్ జైట్లీ అండగా నిలబడ్డారన్నారు.
కేంద్రమంత్రివర్గం తొలి సమావేశంలోనే పోలవరం, నల్లధనంపై చర్చించామన్నారు. ఆ వెంటనే ఖమ్మంలోని ఏడు మండలాలను ఏపీలో కలిపామన్నారు. ఆర్డినెన్స్ ద్వారా ఆ పని చేశామన్నారు. చంద్రబాబు - మోడీలు కలిసి అభివృద్ధిలో పయనింప చేస్తారన్నారు. పోలవరం ఆంధ్రులకు వరం అన్నారు.
అంతకుముందు జైట్లీ మాట్లాడుతూ.. నా బార్డు ద్వారా పోలవరం ప్రాజెక్టుకు తొలి విడత నిధులు అందిస్తున్నామన్నారు. ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలంటే నిధులు అవసరమని చెప్పారు. తొలిసారి ఇరిగేషన్కు నాబార్డు నిధులు ఇస్తోందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తుందన్నారు.