గొడవకే మీడియా: వెంకయ్య, సోషల్మీడియాపై బాబు
విశాఖ: మీడియా గొడవలకే ప్రాధాన్యతనిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రతిబింబించేలా మీడియా పని చేయాలన్నారు. విశాఖ నగరంలో కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్లమెంట్, ది మీడియా లా కాన్ఫరెన్స్ సదస్సులో మాట్లాడారు.
ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగో స్తంభం అన్నారు. ప్రజల వద్దకు నిజాలు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీడియాదేనన్నారు. చర్చల కన్నా గొడవలకే మీడియా ప్రాధాన్యమిస్తుందన్నారు. మీడియా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేయాలన్నారు.
విశాఖతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. భవిష్యత్లో మంచి పర్యాటక కేంద్రంగా విశాఖ అభివృద్ధి చెందుతుందన్నారు. తనను మీసా చట్టం కింద అరెస్టు చేసి జైలులో ఉంచారని, అదే తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు దారి తీసిందని గుర్తు చేసుకున్నారు. గ్రామస్థాయి నుంచి ఎన్నికలు ఐదేళ్లకోసారి వచ్చేలా ఉండాలని, కాని తరచూ ఎన్నికలు జరిగితే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. ఫేస్బుక్, ట్విట్టర్ల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళుతున్నామని చెప్పారు. టెక్నాలజీ, మీడియాను ఉపయోగించుకొని భారత్ పేదరికం నుంచి బయటపడగలదన్నారు. ఐటీ సెక్షన్ 66 ఏపై సుప్రీం కోర్టులో విజయం సాధించటం స్వాగతించాల్సిన విషయమన్నారు.
ఈ కేసు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ సాధించిన విజయమన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండవచ్చన్నారు. 2014 ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్, ఫేస్బుక్ల ద్వారా ప్రచారం చేశారని గుర్తు చేశారు.
మీడియా వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ప్రింటి, ఎలక్ట్రానిక్ మీడియా నుండి సోషల్ మీడియా వరకు చేరుకున్నామని, ప్రపంచంలో ఏం జరిగినా క్షణాల్లో అందరికీ తెలుసిపోతుందన్నారు. ట్విట్టర్, ఫేస్బుక్, వాట్సప్ ద్వారా సమాచారం పంచుకుంటున్నామన్నారు.