బాబు ఈ టి కోరలేదు: వేణుమాధవ్, రాహుల్ పెళ్లిపై...
మహబూబ్ నగర్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావడానికి ముఖ్య కారకులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడేనని ప్రముఖ సినీ నటుడు వేణుమాధవ్ మంగళవారం అన్నారు. మహబూబ్నగర్లో జరిగిన తెలుగుదేశం పార్టీ ప్రజాగర్జన సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ కోసం మొదటి సంతకం పెట్టింది చంద్రబాబే అన్నారు. కానీ ఈ తెలంగాణను ఆయన కోరుకోలేదని, సామాజిక తెలంగాణ కోరుకున్నారన్నారు. తెలంగాణలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుందని, చంద్రబాబు హయాంలోనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందన్నారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలపై ఆయన మండిపడ్డారు.
రాహుల్ గాంధీ ప్రధాని కాడని, అలాగే పెళ్లీ కాదని నటుడు వేణుమాధవ్ ఎద్దేవా చేశారు. ప్రజా గర్జన వేదికపై ఆయన విసిరిన ఛలోక్తులు బాగా పండాయి. పెళ్లి కావాలంటే ఆయన పాలమూరుకొచ్చి టిడిపిలో చేరాలని, అప్పుడు ఇక్కడే పిల్లను చూసి పెళ్ళి చేస్తామన్నారు. తాను బాణాన్ని అని ఒకామె అంటున్నదని, మరొకాయన తన డ్రైవర్ను.. కారును ఇంటికి తీసుకెళ్లమంటే జైలుకు తీసుకెళ్తున్నాడని పరోక్షంగా షర్మిలా, జగన్లను ఉద్దేశించి వేణుమాధవ్ అన్నారు.
బిసిని సిఎం చేసేవారినే ఆదరించండి: ఆర్ కృష్ణయ్య
బిసిని ముఖ్యమంత్రి చేస్తామని టిడిపి ప్రకటించడం గొప్ప విషయమని, ఆ పార్టీకి బిసిలంతా మద్దతివ్వాలని బిసి సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఇతర పార్టీలకు అంత దమ్ముందా అని ప్రశ్నించారు. టిడిపి బిసిలకు ముఖ్యమంత్రి పదవి ప్రకటించగానే భయపడ్డ కాంగ్రెస్ రెండు ప్రాంతాలలో బిసిలకు పిసిసి పదవులిచ్చిందన్నారు. బిసిలవైపు ఎవరైనా వేలెత్తితే ఖబద్డార్ అని హెచ్చరించారు. కెసిఆర్కు దమ్ముంటే పాలమూరు ఎంపీగా పోటీచేసి గెలవాలని కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సవాల్ చేశారు.