నాడు అడ్డుకోలేదే: జగన్పై విహెచ్, మతిభ్రమించి: పొన్నం
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును గద్దె దించేందుకు నాడు వైయస్ రాజశేఖర రెడ్డి తెలంగాణనాదాన్ని తెర పైకి తీసుకు వచ్చినప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడే ఎందుకు అడ్డుకోలేదో చెప్పాలని కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు ఆదివారం ప్రశ్నించారు.
తెలంగాణ వాదానికి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ బీజం వేయలేదని, వైయస్సే వేశారన్నారు. ఈ విషయాన్ని జగన్ గ్రహిస్తే మంచిందన్నారు. అగ్రకులాల ఆధిపత్యాన్ని చూపించేందుకే జగన్ హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావం సభను నిర్వహించారన్నారు.
సీమాంధ్రలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్ సభకు బస్సులను ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు. సీమాంధ్రలో ప్రయివేటు ట్రావెల్స్ అక్కడి ప్రజల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తుంటే ఆర్టీసి బస్సులను జగన్ సభకు ఇవ్వడమేమిటన్నారు. జగన్ సభకు రైళ్లు పెట్టిన విషయమై తాను తెలుసుకొని మాట్లాడుతానని చెప్పారు. జగన్తో అధిష్టానం ఫిక్సింగ్ అన్న మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి నిన్న కిరణ్ను కలిసినప్పుడు బస్సులు విషయం ఎందుకు అడగలేదన్నారు.
జగన్ మానసిక స్థితి బాగా లేదు: పొన్నం
పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్కు మానసిక స్థితి బాగాలేదని కరీంనగర్ ఎంపి పొన్నం ప్రభాకర్ వేరుగా అన్నారు. మతిభ్రమించిన పిచ్చోడిలా ఆయన మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సోనియాను ఇటలీ మహిళ అంటున్న జగన్కు నాడు ఆమె మోచేతి నీళ్లు తాగినప్పుడు ఆ విషయం గుర్తుకు లేదా అని ప్రశ్నించారు. వైయస్ను ముఖ్యమంత్రిగా చేసింది సోనియానే అన్నారు.
హైదరాబాదులోని ఆస్తులను కాపాడుకునేందుకు జగన్ మీటింగులు పెట్టి సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కలిసి ఉండలేమని తెలంగాణ వాళ్లు చెబుతున్నా సిగ్గు లేకుండా జగన్ కలిసే ఉండాలని చెప్పడమేమిటన్నారు. జాతీయ గీతాన్ని అవమానించిన జగన్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల పైన కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు.