ఢిల్లీలో కల్లోలానికి కుట్ర: విహెచ్, యుద్ధమే: కోమటిరెడ్డి
ఖమ్మం/ నల్లగొండ/ న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అల్లకల్లోలం సృష్టించడానికి కొంత మంది కుట్ర చేస్తున్నారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు ఆరోపించారు. ఆయన ఖమ్మంలో శనివారం మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో అవాంఛనీయ ఘటనలకు పాల్పడిన ఎంపీలు మోదుగుల, లగడపాటిలపై ఎన్నికల్లో పోటీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఆయన డిమాండ్ చేశారు.
సీమాంద్ర ప్రజలను ఆ ప్రాంత నేతలే మోసం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. బిజెపి పూటకో మాటతో ప్రజలతో ఆడుకుంటోందని విమర్శించారు. కొందరు తెలంగాణను అడ్డుకోవడానికి ఢిల్లీలో రక్తపాతం సృష్టించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు ఆయన తెలిపారు. సీమాంధ్ర ప్రజలు అధైర్యపడవద్దని, తాాము గుండెల్లో పెట్టుకుంటామని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన ఆగితే యుద్ధమే జరుగతుందని మాజీ మంత్రి, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. విభజన అగితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్తులపై దాడులు చేయాలని తాము చెప్పబోమని, కానీ ఏం జరుగుతుందో మాత్రం తమకు తెలియదని ఆయన అన్నారు. రౌడీ షీటర్లను ఢిల్లీకి పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు.
సీమాంధ్రుల కుట్ర: కోదండరామ్
తెలంగాణ బిల్లును ఎలాగైనా ఆపాలని సీమాంధ్ర నేతలు కుట్రలు చేస్తున్నారని, అందుకే పార్లమెంటులో హింసకు పాల్పడ్డారని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ అన్నారు. తెలంగాణలో యువకుల బలిదానాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశఆరు. అవి ఆగాలంటే వెంటనే తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని ఆయన శనివారం న్యూఢిల్లీలో సూచించారు.