పప్పూ! నీది సార్ధక నామధేయం- గన్నేరు పప్పు బ్యాచ్ శునకావేశం: విజయసాయి, లోకేష్ మాటల యుద్ధం
అమరావతి: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. పప్పు అని మరోసారి నిరూపించుకున్నావంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఇందుకు లోకేష్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఇద్దరు నేతలు ట్విట్టర్ వేదికగా ట్వీట్ల యుద్ధమే చేశారు.
రైతులతో నిరసన ఎందుకు చంద్రబాబు, 'అభివృద్ధి’కామెంట్లపై బొత్స సత్యనారాయణ ఫైర్
పప్పూ! నీది సార్ధక నామధేయం..
తాజాగా లోకేష్ చేసిన ‘ఎన్పీఆర్' ట్వీట్ను లక్ష్యంగా చేసుకుని విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ‘పప్పూ! నీది సార్ధక నామధేయం. జనాభా లెక్కలు పదేళ్లకోసారి జరుగుతాయి. దాని కోసం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోని ఎన్నార్సీ అంటూ అర్ధం చేసుకున్నావంటే... నీ ఇంగ్లీషు, నీ జ్ఞానం చూసి మీ నాన్న నవ్వాలో, ఏడవాలో తెలియక రోజు ప్రెస్మీట్లలో ఫ్రస్టేట్ అవుతున్నాడు' అని విజయసాయి ఎద్దేవా చేశారు.
వేల కోట్లు ముంచిన పుస్తకం..
‘వైఎస్ చౌదరి మీద సిబీఐ, ఈడీ దర్యాప్తు జరగకపోతే ఈ దేశంలో చట్టం, న్యాయం మీద నమ్మకం పోతుంది. విచారణ అడిగితే అందుకు తాను 'సిద్దం' అని చెప్పకుండా తన జీవితం 'తెరిచిన పుస్తకం' అంటున్నాడు. ఔను అది చంద్రబాబు తెరిచిన పుస్తకం. బ్యాంకులను వేల కోట్లలో ముంచిన పుస్తకం' అని విజయసాయి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
యనమలకు చురకలు..
‘రాజధాని వికేంద్రీకరణను వ్యతిరేకించి తూర్పు ప్రజలకు ఆగ్రహం తెప్పించొద్దు యనమల గారూ. మిమ్మల్ని తుని ప్రజలు తరిమేశారన్న అక్కసుతో వైజాగ్ వద్దని రంకెలేయడం న్యాయం కాదు. అయినా దీనికి మీ అనుమతి అవసరం లేదు. ప్రజల ఆశీస్సులున్నాయి సిఎం జగన్ గారికి' అని విజయసాయి వ్యాఖ్యానించారు.
జగన్ నీచ రాజకీయం కాదా?
‘జిత్తుల మారి జగన్ గారి మాయమాటలు నమ్మడానికి ముస్లిం సోదరులు సిద్ధంగా లేరు. వంగి నమస్కారాలు పెట్టి, రాజ్యసభ సాక్షిగా ఎన్ఆర్సీ బిల్లుకు ఒప్పుకుని ఇప్పుడు తూచ్ మేము ఎన్ఆర్సీ అమలు చెయ్యం అని జగన్ గారు చెప్పడం ఆయన నీచ రాజకీయ సంస్కృతికి నిదర్శనం' అంటూ నారా లోకేష్ విమర్శించారు.
గన్నేరు పప్పు పేటీఎం బ్యాచ్ది శునకావేశమే..
‘గన్నేరు పప్పు పేటీఎం బ్యాచ్ శునకావేశానికి నా సానుభూతి. రాజ్యసభ సాక్షిగా ది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్(ఎన్పీఆర్), ఎన్ఆర్సీకి మొదటి అడుగు అని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇప్పటికైనా జగన్ గారు దొంగ నాటకాలు కట్టిపెడితే మంచిది' అని నారా లోకేష్ వైసీపీ నేత విమర్శలకు కౌంటర్ ఇచ్చారు.