కేవీపీ ఉన్నంత వరకు: నెహ్రూ, విజయసాయి చెప్పిన షాకింగ్
విజయవాడ: రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కేవీపీ రామచంద్ర రావు సభలో ఉన్నంత వరకు ప్రత్యేక హోదా బిల్ బతికే ఉంటుందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దేవినేని నెహ్రూ శుక్రవారం నాడు అన్నారు. బిల్లు పైన చర్చ, ఓటింగు జరపకపోవడం బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు.
కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రత్యేక హోదా బిల్లును వాయిదా వేయడం బీజేపీకి సరికాదన్నారు. బీజేపీ అన్యాయం చేసిందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి ఉంటే బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
తాము రాష్ట్ర విభజన చేసి ఒక్క సీట లేకుండా కూర్చున్నామని చెప్పారు. బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, టిడిపి ప్రత్యేక హోదా తేలేకపోయినా వారికి అదే గతి పడుతుందని దేవినేని నెహ్రూ హెచ్చరించారు.

మూడు పార్టీలు కలిసే: విజయ సాయి షాకింగ్
ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో టిడిపి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి మండిపడ్డారు. రాజ్యసభలో ఆ మూడు పార్టీలు కుమ్మక్కై ప్రత్యేక హోదా బిల్లును ఓటింగుకు రాకుండా చేశాయన్నారు.
బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యులే పోడియం వద్దకు వెళ్లి సభను అడ్డుకోవడం సరికాదన్నారు. సమస్యను పొడిగించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ఆయన విమర్శించారు. రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీ తమదే అన్నారు. తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications