జగన్తో.. విజయ సాయి ఉద్వేగం: బాబు '4' ఆశలు గల్లంతు అందుకే!
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యత్వం కోసం నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమైన విజయ సాయి రెడ్డి గురువారం నాడు ఉద్వేగానికి లోనయ్యారు. విజయ సాయిని వైసిపి అధినేత జగన్ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించారు.
పార్టీ కార్యాలయంలో జరిగిన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు వెంటరాగా అసెంబ్లీకి బయలుదేరిన సాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీకి బయలుదేరే ముందు పార్టీ కార్యాలయం వద్ద ఆయన కాస్తంత ఉద్వేగానికి లోనయ్యారు.
ప్రాణం ఉన్నంత వరకు తాను వైయస్ కుటుంబంతోనే ఉంటానని చెప్పారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తానన్నారు. రాజ్యసభలో పార్టీ వాణిని వినిపిస్తానన్నారు. పార్టీ పురోభివృద్ధికి శాయశక్తులా కృష్టి చేస్తానని చెప్పారు.
పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన కూడా ఆయన స్పందించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చేసి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. పార్టీ ఫిరాయింపులు నీతిబాహ్యమైన చర్య అని విజయ సాయి రెడ్డి దుయ్యబట్టారు.
చంద్రబాబు '4' ఆశలు గల్లంతేనా?
ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. బలం ప్రకారం టిడిపి మూడు, వైసిపి ఒక స్థానం గెలుచుకుంటుంది. అయితే, నాలుగో సీటు పైన కూడా టిడిపి మొదటి నుంచి కన్నేసిన విషయం తెలిసిందే. నాలుగో సీటును దక్కించుకునేందుకు పోటీకి నిలపాలని మొదటి నుంచి భావిస్తున్నారు.
కానీ నాలుగో స్థానానికి పోటీ నిలిపి ఓడిపోయి పరువు పోగొట్టుకోవడం వద్దని పలువురు నేతలు చంద్రబాబుకు సూచించారని తెలుస్తోంది. చంద్రబాబు కూడా అదే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఎమ్మెల్యేల చేరికల ఎఫెక్ట్
ఇటీవలి వరకు వైసిపి నుంచి టిడిపిలోకి 17 మంది ఎమ్మెల్యేలు చేరారు. రాజ్యసభ ఎన్నికల నాటికి 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతారని, తద్వారా నాలుగో రాజ్యసభ సీటును కూడా తామే కైవసం చేసుకుంటామని టిడిపి నేతలు ఇన్నాళ్లుగా చెప్పుకొచ్చారు. అయితే, చేరికలు 17తో ఆగిపోయింది. వైసిపి బలం 50గా ఉంది. టిడిపి విజయ సాయి పైన పోటీ పెట్టినా ఆయనే గెలుస్తారు. అప్పుడు టిడిపి పరువు పోతుంది.
ఈ నేపథ్యంలో పోటీ పెట్టకపోవడమే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో, రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉండదు కాబట్టి వైసిపిలో ఉంటూనే ఎమ్మెల్యేలు టిడిపి అభ్యర్థికి ఓటు వేయవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రస్తుతం జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలు ఆయనకే సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాలుగో సీటు ఆశలు గల్లంతేనని అంటున్నారు.












Click it and Unblock the Notifications